సాక్షి, అమరావతి: ప్రభుత్వ వేధింపులపై కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్వో)లు రాష్ట్రవ్యాప్త నిరసనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 23న విజయవాడ ధర్నా చౌక్లో మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించినట్టు సీహెచ్వో అసోసియేషన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎఫ్ఆర్ఎస్ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్) వేధింపులతో పాటు, 10,032 మంది సీహెచ్వోల ఇతర సమస్యల పరిష్కారమే ఎజెండాగా ధర్నా చేపట్టనున్నామన్నారు.
సుప్రీం కోర్టు తీర్పులు, రాజ్యాంగం కల్పించిన హక్కులకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పులి ప్రేమ్కుమార్ మండిపడ్డారు. రాత్రి 8 గంటలకు హాజరు వేయాలనడం రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమే అన్నారు. గ్రామాల్లో మహిళా ఉద్యోగులకు రక్షణ లేని చోట రాత్రి 8 గంటలకు హాజరు నిబంధనతో నిర్బంధించడం ప్రాథమిక హక్కులను హరించడమేనని స్పష్టం చేశారు.


