గొప్ప భాషోద్యమకారుడు గిడుగు రామ్మూర్తి: సీఎం జగన్

సాక్షి, అమరావతి: వాడుక భాషాద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. ‘గ్రాంధికాన్ని సరళీకరించి వ్యవహారిక భాషలో ఉన్న అందాన్ని.. పలకడంలో ఉండే సౌఖ్యాన్ని తెలియజెప్పిన భాషోద్యమకారుడు గిడుగు రామ్మూర్తి. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టిని వచన భాషతో సామాన్యుల చేతికందించిన.. గిడుగు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం తెలుగుని సన్మానించుకోవడమే’ అంటూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.
‘వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు, ఉత్తరాంధ్ర బిడ్డ గిడుగు రామ్మూర్తి పంతులకు ఇవే నా (జయంతి ) నివాళులు. భాషా సాహితీ రంగాలకు ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఈనాటి పత్రికా భాషకు దిక్చూచి గిరిజన భాషలకూ లిపి సృష్టించిన మహానుభావుడాయన’అని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.