వాహనాల కొనుగోలుపై 10 శాతం రోడ్ సెస్ మోత
వాహనదారులపై ఏటా రూ.1,500 కోట్ల భారం
కేంద్రం జీఎస్టీ రేటు తగ్గించినా.. జనం నడ్డి విరుస్తున్న బాబు
మరోవైపు టీడీపీ మద్యం సిండికేట్పై వరాల జల్లు
బార్లపై 15 శాతం ఏఆర్ఈటీ రద్దు
ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.350 కోట్ల గండి
అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచనన్న చంద్రబాబు
అధికారంలోకి రాగానే రూ. 20,135 కోట్ల మేర బాదుడు
సాక్షి, అమరావతి: పండగ పూట కూడా ప్రజలపై పన్నుల బాదుడే..! అన్నట్లుగా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోంది. వాహనాల కొనుగోలుపై రహదారి భద్రత పేరుతో రోడ్ సెస్ బాదుడుతో వాహనదారులపై ఏటా రూ.1,500 కోట్ల భారీ ఆరి్థక భారాన్ని మోపింది. మరోచేత్తో పండుగ వేళ టీడీపీ సిండికేట్కు అడ్డగోలుగా లాభాలు కట్టబెట్టేందుకు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టింది. ఏటా రూ.350 కోట్లు సిండికేట్కు దోచిపెట్టేందుకు పచ్చ జెండా ఊపింది. అందుకోసం హడావుడిగా మంగళవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసిది. చంద్రబాబు సర్కారు సంక్రాంతి బాదుడు ఇలా ఉంది..!
కేంద్రం కరుణించినా... బాబు పన్నుల కొరడా
కేంద్ర ప్రభుత్వం కరుణించినా చంద్రబాబు మాత్రం ససేమిరా అంటూ రాష్ట్ర ప్రజలపై పన్నుల కొరడా ఝళిపించారు. జీఎస్టీ రేట్లను కేంద్ర ప్రభుత్వం తాజాగా తగ్గించడంతో కాస్త ఊరట లభించిందనుకునేలోపే.. చంద్రబాబు ఆ మొత్తాన్ని తమ ఖాతాలోకి జమ చేసుకుని పన్నుల భారం ప్రజలపైనే వేశారు. కేంద్ర ప్రభుత్వం 2017 నుంచి వాహన కొనుగోళ్లపై 28 శాతం జీఎస్టీ విధిస్తూ వచ్చింది. ఇటీవలే జీఎస్టీ రేట్లను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ప్రజలు కొనుగోలు చేసే వాహనాలపై జీఎస్టీ రేటును 28 నుంచి 18 శాతానికి తగ్గించింది. దాంతో 10 శాతం జీఎస్టీ భారం తగ్గిందని ప్రజలు కాస్త ఊరట చెందారు.
కానీ దీన్ని చంద్రబాబు సహించలేకపోయారు. రాష్ట్ర ప్రజలకు ఆ మాత్రం కూడా జీఎస్టీ పన్నుల తగ్గింపు ఊరట మిగల్చకూడదని భావించి రోడ్ సెస్ పేరుతో కొత్త పన్ను రూపొందించారు. ఏపీలో వాహనాల కొనుగోళ్లపై 10 శాతం రోడ్ సెస్ విధించాలని ఇటీవల రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. ఆమేరకు ప్రజలు కొనుగోలు చేసే వాహనాలపై 10 శాతం రోడ్ సెస్ విధించేందుకు అనుమతినిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకోసం రాష్ట్ర మోటారు వాహనాల చట్టాన్ని సవరించింది.
సద్వినియోగంపై సందేహాలు..
ప్రజలపై పన్నుల భారానికి చంద్రబాబు ప్రభుత్వం రహదారి భద్రత సెస్సు అనే ముసుగు వేసింది. ఆ సెస్సు ద్వారా వసూలు చేసే నిధులు ఎలా వెచి్చస్తామన్నది వెల్లడించలేదు. రహదారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు కూడా అందుకోసం వెచ్చించడం లేదనే విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. హోం, వైద్య–ఆరోగ్య, ఆర్ అండ్ బీ శాఖల సంయుక్త కమిటీల ద్వారా ఆ నిధులను వెచి్చంచాలి. కానీ ఆ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సెస్సు పేరిట ఏటా వసూలు చేసే రూ.1,500 కోట్లను సద్వినియోగం చేస్తారనే నమ్మకం ఏమాత్రం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
బార్లపై 15 శాతం ఏఆర్ఈటీ రద్దు
వాహన కొనుగోలుదారులపై పన్నుల బాదుడు బాదిన చంద్రబాబు ప్రభుత్వం... టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి మాత్రం తలుపులు బార్లా తెరచింది. రాష్ట్రంలో బార్లపై విధిస్తున్న 15 శాతం ‘అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్ఈటీ)ని రద్దు చేసింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఖజానాకు ఏటా రూ.350 కోట్ల మేర గండి పడనుంది. 2014–15లో కూడా ఇదే రీతిలో టీడీపీ సిండికేట్ బార్లు, మద్యం దుకాణాలపై ప్రివిలేజ్ ఫీజును ఏకపక్షంగా రద్దు చేసింది. తద్వారా ఖజానాకు రూ.5,400 కోట్ల మేర గండి కొట్టింది. చంద్రబాబు ప్రభుత్వ అవినీతిని సీఐడీ గతంలోనే ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. చంద్రబాబుతోపాటు అప్పటి మంత్రులు కొల్లు రవీంద్ర తదితరులను నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. ఆ కేసును చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల మూసివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బార్లపై ఏఆర్ఈటీ రద్దు చేస్తూ మరో దందాకు తెర తీసింది.
మద్యం బాటిల్పై రూ.10 బాదుడు..
ఇక మద్యం ప్రియులపై కూడా చంద్రబాబు ప్రభుత్వం పన్నుల మోత మోగించింది. ప్రతి మద్యం బాటిల్పై రూ.10 చొప్పున ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
రూ. 20,135 కోట్ల మేర కరెంట్ చార్జీల బాదుడు కాగా, అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు.. ఏకంగా రూ. 20,135 కోట్ల మేరకు కరెంట్ చార్జీలు పెంచి ప్రజల నడ్డివిరిచారు.
ఏటా పన్నుల భారం రూ.270 కోట్లు కాదు... రూ.1,500 కోట్ల బాదుడే
రోడ్ సెస్ పన్నుల భారంపై చంద్రబాబు సర్కారు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. రాష్ట్రంలో ఏటా 73 వేల వాహనాలను విక్రయిస్తారని... ఆ ప్రకారం కొత్తగా విధించిన 10 శాతం రోడ్ సెస్తో వాహనాల కొనుగోలుదారులపై నెలకు రూ.22.50 కోట్ల చొప్పున ఏడాదికి రూ.270 కోట్ల భారం పడుతుందని మంత్రులు అధికారికంగా వెల్లడించారు. అయితే ప్రజలపై పడే పన్నుల భారాన్ని ఉద్దేశపూర్వకంగా తక్కువగా చూపించేందుకు యతి్నంచారు. వాస్తవానికి అందుకు ఏడెనిమిది రెట్లు అధిక భారం పడుతుందని కేంద్ర జీఎస్టీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
కేంద్ర జీఎస్టీ విభాగం అధికారిక గణాంకాల ప్రకారం వాహనాలపై 28 శాతం జీఎస్టీ పూర్తిగా అమలులో ఉన్న 2024–25లో రాష్ట్రంలో వాహనాల విక్రయాల ద్వారా రూ.4,200 కోట్ల జీఎస్టీ పన్ను ఆదాయం వచ్చింది. అంటే.. 28 శాతం జీఎస్టీ రేటుతో రూ.4,200 కోట్లు వచ్చాయి. జీఎస్టీ రేటును కేంద్రం ఇటీవల 18 శాతానికి తగ్గించింది. దాంతో జీఎస్టీ రేటు 10 శాతం తగ్గడంతో ఏడాదికి రూ.1,500 కోట్లు పన్ను ఆదాయం తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వమే అంచనా వేసింది. అంటే రాష్ట్ర ప్రజలకు ఏటా రూ.1,500 కోట్ల మేర ఊరట కలుగుతుందని పేర్కొంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ 10 శాతం పన్ను ఉపశమనం లేకుండా చేసింది. వాహనాలపై 10 శాతం రోడ్సెస్ విధించింది. అంటే రాష్ట్రంలో వాహనాల కొనుగోలుదారులపై ఏటా రూ.1,500 కోట్ల ఆర్థిక భారం పడనుందన్నది స్పష్టమవుతోంది.


