బడా సంస్థలకు ‘సంతర్పణ’ చేస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం
గ్రీన్కో ఎనర్జీకి 2,467.28 ఎకరాలు కేటాయింపు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం కార్పొరేట్లకు భూముల సంతర్పణ చేసే కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తోంది. నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం గ్రామంలో గ్రీన్ కో సంస్థ ఏర్పాటు చేస్తోన్న మెగా ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 2,467.28 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూమిని నమ్ముకుని దశాబ్దాలుగా సాగు చేసుకుంటోన్న 195 మంది పేద శివాయి జమేదార్లకు 233.91 ఎకరాల విస్తీర్ణానికి మాత్రమే ఎకరాకు రూ.5 లక్షల చొప్పున అరకొర ఎక్స్గ్రేíÙయా ప్రకటించింది. అది కూడా నష్టపోతున్న మొత్తం భూమికి కాకుండా కేవలం కొంత భాగానికే పరిహారాన్ని పరిమితం చేసింది.
టీడీపీ ఆఫీసుకు 2 ఎకరాలు..
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో 2.002 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ కార్యాలయ నిర్మాణానికి కేటాయిస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది. కోట్ల రూపాయల మార్కెట్ విలువ కలిగిన ఈ భూమిని, కేవలం ఏడాదికి ఎకరాకు రూ.1,000 నామమాత్రపు లీజు ధరతో 66 ఏళ్ల పాటు (99 ఏళ్లకు పొడిగించేలా) టీడీపీ జిల్లా అధ్యక్షుడి పేరుతో కేటాయించింది. అలాగే, చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలోని కంగుంది రెవెన్యూ గ్రామంలో ఉన్న 529.34 ఎకరాల అడవి పోరంబోకు భూమి స్వభావాన్ని ఏడబ్ల్యూడీ (అసెస్డ్ వేస్ట్ డ్రై ల్యాండ్)గా మారుస్తూ మరో జీవో జారీ చేసింది


