
అదీ చంద్రబాబు ఘనత
వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో రూ.8,500 కోట్లకు పైగా ఖర్చుతో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం
వీటిలో 10 కళాశాలలు ప్రైవేటుకు పప్పుబెల్లాల్లా చంద్రబాబు ధారాదత్తం
పేదలకు మెరుగైన వైద్యం, నాణ్యమైన విద్య అందకుండా కుట్రలు
కొత్త వైద్య కళాశాలల మంజూరు కోసం కేంద్రంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్న రాష్ట్రాలు..
2016–18 మధ్య దేశంలో 82 వైద్య కళాశాలలకు కేంద్రం సాయం
ఆ సమయంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతిస్తూ కూడా చంద్రబాబు ఘోర వైఫల్యం
ఇప్పుడు కూడా కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు
కొత్త వైద్య కళాశాలలు తీసుకురావాల్సింది పోయి.. వైఎస్ జగన్ తెచ్చిన కొత్త కాలేజీలను సైతం ప్రైవేటుపరం చేస్తున్న చంద్రబాబు
దీంతో మెడికల్ సీట్లు పోవడంతో పాటు పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం దూరం
చంద్రబాబు విజనరీ పాలన ఇదేనా? అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్న విద్యావేత్తలు
సాక్షి, అమరావతి: పేదలకు మెరుగైన వైద్యం, వైద్య విద్య అందకుండా సీఎం చంద్రబాబు చేస్తున్న కుట్రలు పరాకాష్టకు చేరాయి. ఒకవైపు కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో ఉంటూ కూడా రాష్ట్రానికి ప్రభుత్వ వైద్య కళాశాలలు సాధించుకోవడంలో చంద్రబాబు ఘోర వైఫల్యం చెందారు. మరోవైపు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన కాలేజీలను సైతం పబ్లిక్–ప్రైవేట్–పార్టనర్షిప్(పీపీపీ) పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారు.
ఎందుకంటే... ఎంబీబీఎస్ వంటి కోర్సులు ధనికుల పిల్లలే చదవాలన్నదే చంద్రబాబు విజన్. చంద్రబాబు మొదట ముఖ్యమంత్రి అయిన 1995 నుంచి ఆయన తీరు ఇంతే. అప్పటి నుంచి ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు అధికారంలో ఉన్నా తన హయాంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేయలేదు. ముఖ్యంగా 2016–18 మధ్య కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం దేశవ్యాప్తంగా 82 వైద్య కళాశాలల ఏర్పాటుకు సాయం చేసింది.
ఆ సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ, ఆ ప్రభుత్వంలో చేరి కూడా చంద్రబాబు ఒక్క ప్రభుత్వ కళాశాలను కూడా సాధించలేకపోయారు. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నానని గొప్పగా చెప్పుకొనే చంద్రబాబు రాష్ట్రంలో వైద్య విద్యకు ఘోరీ కట్టడం వల్ల ప్రస్తుతం ఏపీ 6,500 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ సీట్లలో కూడా 800 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో వచ్చినవే.
10 కళాశాలలు ప్రైవేటుకు ధారాదత్తం
గత వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో రూ.8,500 కోట్లకు పైగా వ్యయంతో ఏకంగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టింది. ఇందులో ఐదు కళాశాలల నిర్మాణాలు కూడా పూర్తయి గత ప్రభుత్వ హయాంలోనే తరగతులు కూడా ప్రారంభించాయి. మరో ప్రభుత్వ కళాశాల గతేడాది ప్రారంభమైంది. మిగతావి వివిధ నిర్మాణాల దశల్లో ఉన్నాయి. గతేడాది అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వీటిని పూర్తి చేసి పేదలకు అందుబాటులోకి తీసుకురాకపోగా, మరింత బరితెగించి వీటిలో 10 కళాశాలలను ప్రైవేటుకు ధారాదత్తం చేస్తున్నారు.
తద్వారా వెనుకబడిన పార్వతీపురం మన్యం, శ్రీ సత్యసాయి, ప్రకాశం, కర్నూలు, బాపట్ల వంటి జిల్లాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం, యువతకు వైద్య విద్య అందకుండా కుట్రకు తెరలేపారు. ధనికులకే కార్పొరేట్ వైద్యం, వారి పిల్లలకే ఎంబీబీఎస్ చదువులు అందుబాటులో ఉండాలన్నదే చంద్రబాబు ఆలోచన. దేశంలోని వివిధ రాష్ట్రాలు కేంద్రంతో కొట్లాడి మరీ ప్రభుత్వ వైద్య కళాశాలలు తెచ్చుకుంటున్నాయి. అలాంటిది కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తూ కూడా కొత్త వైద్య కళాశాలలు సాధించడంలో చంద్రబాబు ఘోరవైఫల్యం చెందారు. చివరకు గత ప్రభుత్వం తెచ్చిన కళాశాలలను కూడా పప్పు బెల్లాల్లా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయడానికి సిద్ధమయ్యారు.
రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు తీరని ద్రోహం
రాష్ట్రంలో తొలి వైద్య కళాశాల ఆంధ్రా మెడికల్ కాలేజీ 1923లో ఏర్పాటైంది. అనంతరం 2019 నాటికి అంటే 96 ఏళ్లలో రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కేవలం 11 వైద్య కళాశాలలే అందుబాటులోకి వచ్చాయి. వీటిలోనూ శ్రీకాకుళం, ఒంగోలు, కడప రిమ్స్, నెల్లూరు కళాశాలలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఏర్పాటైనవే. ఇక 2019 ముందు వరకూ మూడుసార్లు 14 ఏళ్లు సీఎంగా వ్యవహరించిన చంద్రబాబు ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేయలేదు. వాస్తవానికి 2014–19 మధ్య బాబు కేంద్రంలో ఎన్డీయే–1లో భాగస్వామిగా ఉండగానే ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల విధానాన్ని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2016–18 మధ్య రెండు దశల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 82 వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం సహాయం చేసింది.
అదే సమయంలో 2014–18 వరకూ కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు భాగస్వామిగా కూడా ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాస్ వైద్య శాఖ మంత్రిగా వ్యవహరించారు. అయినప్పటికీ కొత్తగా ఒక్కటంటే ఒక్క కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు కూడా కేంద్రానికి ప్రతిపాదన పంపకుండా రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం తలపెట్టారు. 2014– 19 మధ్య చంద్రబాబు చేసిన ద్రోహం కారణంగానే మన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ఇంకోవైపు మెరుగైన వైద్యం అందక పేద, మధ్యతరగతి ప్రజలకు నష్టం జరిగింది. ఇది చాలదన్నట్టు గతేడాది గద్దెనెక్కిన వెంటనే పీపీపీ విధానంలో కొత్త వైద్య కళాశాలల నిర్వహణ పేరిట రాష్ట్ర ప్రజలపై మరో పిడుగు వేశారు.
బాబు మార్క్ వెన్నుపోటు
కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ఉన్నత ప్రమాణాలతో నిర్వహించడంలో ఆరి్థక ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టారు. తద్వారా వచ్చిన నిధులను విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పన, కళాశాల, ఆస్పత్రి అభివృద్ధికి వెచ్చించేలా ప్రణాళిక రచించారు. దీంతో అప్పట్లో టీడీపీ నాయకులు గుండెలు బాదుకున్నారు. రోడ్లెక్కి అన్యాయం, అక్రమం అంటూ ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే సెల్ఫ్ఫైనాన్స్ విధానం రద్దు చేస్తామని హామీలు గుప్పించారు.
యువతను నమ్మించి గద్దెనెక్కాక బాబు మార్క్ వెన్నుపోటు పొడిచారు. సెల్ఫ్ ఫైనాన్స్ విధానం రద్దు చేయకపోగా ఏకంగా ప్రభుత్వ కళాశాలలనే ప్రైవేట్కు కట్టబెట్టి నమ్మించి గొంతు కోస్తున్నారని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాడు సెల్ఫ్ఫైనాన్స్ విధానంపై గుండెలు బాదుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమైపోయారని నిలదీస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలను ప్రైవేట్కు ధారాదత్తం చేస్తుంటే ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశి్నస్తున్నారు.