వాతావరణం చల్లబడింది | Chance of rain in many places today and tomorrow | Sakshi
Sakshi News home page

వాతావరణం చల్లబడింది

Apr 6 2025 5:50 AM | Updated on Apr 6 2025 5:50 AM

Chance of rain in many places today and tomorrow

నేడు, రేపు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం

అకాల వర్షాలు, ఈదురుగాలులతో ఉద్యాన, వ్యవసాయ పంటలకు నష్టం

సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి/చింతలపూడి: నెల రోజులుగా భానుడి భగభగలతో ఉడికిపోతున్న రాష్ట్రం.. ఉపరితల ద్రోణుల ప్రభావంతో చల్లబడింది. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో.. ప్రజలు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందారు. దక్షిణ అండమాన్‌ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 3.1 కిమీ ఎత్తులో ఉంది.  

అదేవిధంగా.. ఉత్తర తమిళనాడు, కర్ణాటక మీదుగా ఉత్తర దక్షిణ ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

ఉత్తరాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి వానలు, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వెల్లడించారు. గంటకు 30–40 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా.. రాగల నాలుగు రోజుల్లో సాధారణం కంటే 2–4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నా­యని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. 

అన్నదాతకు అపార నష్టం..
మరోవైపు.. గడిచిన రెండ్రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో రాష్ట్ర­వ్యాప్తంగా ఉద్యాన, వ్యవసాయ పంటలకు అపార నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనాల ప్రకారం.. వైఎస్సార్, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య, కర్నూలు, ప్రకాశం, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, నెల్లూరు, బాపట్ల, అనకాపల్లి జిల్లాల్లో పంటలు దెబ్బతిన్న­ట్టుగా గుర్తించారు. దాదాపు 8,770 ఎకరాల్లో ఉద్యాన, వ్యవసాయ పంటలు దెబ్బ­తిన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నా­రు. 

ఏడు జిల్లాల్లో 7,078 ఎకరాల్లో వరి, మొక్క జొన్న, మినుము, అలసందలు, సజ్జలు, తదితర పంటలు దెబ్బతి­నగా, తొమ్మిది జిల్లాల్లో 1,692 ఎకరాల్లో అరటి, బొప్పాయి, బత్తాయి, కూరగా­యలు వంటి ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ఇప్పటివరకు తేల్చారు. ఒక్క వైఎస్సార్‌ జిల్లా­లోనే 1,200 ఎకరాల్లో అరటి పంట నేలవాలి­పోయింది. ఈదురుగాలుల ప్రభా­వా­నికి కోతకు సిద్ధంగా ఉన్న మామిడి తోటల్లో వేలాది టన్నుల మామిడి కాయలు నేలరాలి­పోయినట్లు రైతులు వాపోతున్నారు. 

అమ్మకానికి సిద్ధంచేసిన పొగాకు  తడిసి ముద్దయింది. వ్యవసాయ పంటల పరంగా ఇవన్నీ ప్రాథమికంగా అంచనాలు మాత్రమే. ఇవి మరింత పెరిగే అవకాశాలు­న్నా­యని చెబుతున్నారు. ఇక ఏలూరు జిల్లా­లోనూ పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఈదురు­గాలు­లతో అనేక ప్రాంతాల్లో రేకుల షెడ్లు దెబ్బ­తినగా.. చెట్లు పడిపోయాయి. 

చింతలపూడి మండలం సుప్రీంపేటలో ఈదురుగాలులకు చెట్టు విరిగి ఇంటిపై పడడంతో ఇంట్లో ఉన్నవారికి గాయాల­య్యాయి. మామిడితోటల్లో కాయలు రాలిపో­యా­యి. చాలాచోట్ల వైర్లు ఊడి­పో­వ­డంతో  విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కొయ్యల­గూడెంలోనూ పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement