తిరుమల: తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలలో భాగంగా రెండవ రోజైన మంగళవారం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది.
ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లు సాయంత్రం అక్కడినుండి బయల్దేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 1న పౌర్ణమి గరుడసేవ రద్దు
శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీన పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.
శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు జరుగుతున్న కారణంగా పౌర్ణమి గరుడసేవ రద్దయింది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.


