వైద్య పోస్టుల భర్తీకి బోర్డు | Board for the recruitment of medical posts | Sakshi
Sakshi News home page

వైద్య పోస్టుల భర్తీకి బోర్డు

Jun 24 2023 4:41 AM | Updated on Jun 24 2023 8:45 AM

Board for the recruitment of medical posts - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజలకు నిరంతరం నాణ్యమైన వైద్య సేవలందించడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా ఎప్పటి పోస్టులు అప్పుడు భర్తీ చేస్తున్నారు. వైద్య శాఖలో పోస్టుల భర్తీ కోసమే ప్రత్యేకంగా ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంఎస్‌ఆర్‌బీ)ని ఏర్పాటు చేశారు. ఈ బోర్డుకు వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు. మెంబర్‌ సెక్రటరీగా స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్, మరో మెంబర్‌గా జాయింట్‌ డైరెక్టర్‌ వ్యవహరిస్తారు.

ఈ బోర్డు కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. డీహెచ్, ఏపీవీవీపీ, డీఎంఈ పరిధుల్లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (సీఏఎస్‌), సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ (సీఏఎస్‌ఎస్‌), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను రాష్ట్ర స్థాయిలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌లో భర్తీ చేస్తారు. పదోన్నతుల ద్వారా డిప్యూటి సివిల్‌ సర్జన్, సివిల్‌ సర్జన్, అసోసియేట్‌ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేస్తుంటారు.

ఇప్పటివరకు ఈ ప్రక్రియను సంబంధిత విభాగాధిపతుల కార్యాలయాల ద్వారానే చేపడుతున్నారు. ఇకపై ఈ నియామకాలను బోర్డు చేపడుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించారు. ప్రస్తుతం వెబ్‌సైట్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరుకు పూర్తి స్థాయిలో బోర్డు కార్యకలాపాలు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని మెంబర్‌ సెక్రటరీ ఎం. శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోస్టుల భర్తీ
ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల తాకిడికి అనుగుణంగా మా­నవ వనరులను సమకూర్చడానికి  సీఎం జగన్‌ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. వైద్య శాఖ చరి­త్రలో ఎన్నడూ లేని విధంగా 2019 నుంచి ఇప్పటివరకు 49 వేల వరకు పోస్టులను భర్తీ చేసింది. అంతేకాకుండా ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా అ­త్య­వసర అనుమతులను ఇచ్చింది. వైద్య శాఖలో 4 వా­రాలకు మించి ఏ పోస్టు ఖాళీగా ఉండటానికి వీల్లేద­ని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement