రాష్ట్రంలో 2025–26లో 898 విమాన సర్వీసులు తగ్గుదల
విశాఖ, విజయవాడ, రాజమండ్రిలో తగ్గిన సర్వీసులు
కేంద్ర మంత్రిగా టీడీపీ నేత ఉన్నా ఫలితం శూన్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విమాన సర్వీసులు భారీగా తగ్గిపోయాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025–26లో రాష్ట్రంలో విమాన సర్వీసుల సంఖ్య 898 తగ్గినట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. 2024–25లో రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల నుంచి 63,775 సర్వీసులు నడవగా.. 2025–26లో 62,877కే పరిమితమైంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రాష్ట్రానికి చెందిన టీడీపీ నేత కె.రామ్మోహనాయుడు ఉన్నా.. విమాన సర్వీసులు తగ్గిపోవడం గమనార్హం. ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయ సర్వీసులు అత్యధికంగా నడిచే విశాఖ, విజయవాడల్లో సర్వీసులు తగ్గిపోయాయి.
విశాఖలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ఏకంగా 931 నుంచి 772కు పడిపోగా.. మొత్తంగా 22,210 నుంచి 21,711కు తగ్గిపోయాయి. విజయవాడలో దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు సంఖ్య 18,558 నుంచి 17,112కు, రాజమండ్రిలో 8,441 నుంచి 8,047కు పడిపోయాయి. మరోవైపు ప్రయాణికుల సంఖ్యలో మాత్రం వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం రాష్ట్రం నుంచి 62.28 లక్షల మంది వివిధ ప్రాంతాలకు విమానాల్లో ప్రయాణించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 5.54 శాతం అధికం.
ఈ వృద్ధి కోస్తాంధ్రలో తక్కువగా ఉంటే.. రాయలసీమలో ఎక్కువగా ఉంది. 2024–25లో కడప నుంచి 52,745 మంది ప్రయాణించగా.. ఆ సంఖ్య 2025–26లో 70,450కి పెరిగింది. అలాగే తిరుపతిలో ప్రయాణికుల సంఖ్య 9,95,640 నుంచి 11,96,176కు చేరింది. రాష్ట్రంలో ముఖ్యమైన విశాఖపట్నం విమానాశ్రయం వృద్ధి 0.4 శాతానికి పరిమితమయ్యింది. విశాఖ నుంచి ప్రయాణించిన వారి సంఖ్య 29.55 లక్షల నుంచి 29.67 లక్షలకు మాత్రమే పెరగ్గా, విజయవాడలో ప్రయాణికుల సంఖ్య 13.88 లక్షల నుంచి 14.11 లక్షలకు పెరిగింది.


