'కోర్‌'కోక పోతే ఎలా..? | 80 percent of people are inclined towards computer sciences and data sciences | Sakshi
Sakshi News home page

'కోర్‌'కోక పోతే ఎలా..?

Jun 13 2026 5:36 AM | Updated on Jun 13 2026 5:36 AM

80 percent of people are inclined towards computer sciences and data sciences

80 శాతం మంది కంప్యూటర్‌ సైన్సెస్, డేటా సైన్సెస్‌ వైపు మొగ్గు 

ఆ కోర్సులు బోధించే అధ్యాపకుల్లో వెంటాడుతున్న నైపుణ్యాల కొరత  

సాఫ్ట్‌వేర్‌ కొలువులు దక్కక నిరాశానిస్పృహలు

ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్న కోర్‌ బ్రాంచుల వైపు ఆసక్తి చూపని విద్యార్థులు  

ఇంజినీరింగ్‌లో కోర్‌ బ్రాంచులైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్,     ఎలక్ట్రానిక్స్‌ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఏటేటా గణనీయంగా తగ్గిపోతోంది. ఐదేళ్ల క్రితం ఈ బ్రాంచ్‌ల్లోని సీట్లు, ప్రవేశాల సంఖ్యకు.. గత విద్యా సంవత్సరంలోని సీట్లు, ప్రవేశాల సంఖ్యకు మధ్య భారీ తేడా కనిపిస్తోంది. ఇదిలాగే కొనసాగితే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు తప్ప తక్కిన ఇంజినీర్లు ఉండరనే భయం  విద్యావేత్తలలో నెలకొంది.  

అనంతపురం: కంప్యూటర్‌ సైన్సెస్, అనుబంధ    ఎమర్జింగ్‌ కోర్సుల్లో ఇంజినీరింగ్‌ విద్యనభ్యసించిన వారు తగిన నైపుణ్యాలు లేకపోవడంతో ‘సాఫ్ట్‌వేర్‌’ కొలువులు దక్కక చతికిలపడుతున్నారు. ఏపీఈఏపీ సెట్‌లో అర్హత సాధించిన వారిలో 80 శాతం మంది సీఎస్‌ఈ, డేటా సైన్సెస్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లర్నింగ్, సైబర్‌ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింక్స్‌ (ఐఓటీ), డిజైన్, కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్, ఆటోమేషన్‌ తదితర కోర్సుల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉండే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఈసీఈ తదితర కోర్‌ బ్రాంచుల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ఈసీఈ మినహా మిగిలిన కోర్‌ బ్రాంచ్‌ విద్యార్థుల సంఖ్య మరీ తక్కువగా ఉంటోంది.  

8 శాతమే స్కిల్డ్‌ ఉద్యోగాలు 
ఇంజినీరింగ్‌లో ప్రతి 100 సీట్లలో 80 శాతం మంది విద్యార్థులు కంప్యూటర్‌ సైన్సెస్‌ వాటి అనుబంధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందుతున్నారు. సాఫ్ట్‌వేర్‌  రంగంలో కొలువులు తగ్గుముఖం పట్టడంతో 8 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నాయి. మిగిలిన వారు కంపెనీల చుట్టూ         ప్రదక్షిణలు చేస్తున్నారు. తక్కువ జీతంతో వచ్చే కొలువులు దక్కుతున్నా.. గణనీయమైన ప్యాకేజీ కావాలన్న ఆశతో అవకాశాలను వదులుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కోడింగ్‌ లేకపోవడం, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాంకేతికతపై సాధికారిత లేకపోవడంతో ఉపాధి అవకాశాలను దూరం చేస్తున్నాయి.  

» బీటెక్‌ అనంతరం మూడు, నాలుగు సంవత్సరాల సమయాన్ని కాలయాపన చేస్తున్నారు. నాలుగు సంవత్సరాల అనంతరం ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే.. ఈమధ్య కాలానికి ఉద్యోగం చేసినట్లు సర్వీస్‌ సర్టిఫికెట్‌ అందజేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అనుభవం ఉందని చెబితే.. అందుకు తగ్గట్టు నైపుణ్యాలు లేనందున   రెండు, మూడు నెలలకే ఇంటికి తిరుగుముఖం పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నైపుణ్యాలు పెంపొందించుకోకపోతే కంప్యూటర్‌ సైన్సెస్‌ బ్రాంచ్‌ కోర్సుల్లో బీటెక్‌ పూర్తి చేసినా ఫలితం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  

నైపుణ్యం కలిగిన అధ్యాపకులేరీ? 
బీటెక్‌ 2, 3, 4 సంవత్సరాల్లో ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు తప్పనిసరి. కంప్యూటర్‌ సైన్సెస్, ఐటీ ఆధారిత కోర్సుల్లో నైపుణ్యం గల అధ్యాపకుల కొరత అధికంగా ఉంది. ఆరి్టఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, మెషిన్‌ లెరి్నంగ్‌ వంటి ఐటీ ఆధారిత కోర్సులకు  ఎంటెక్, పీహెచ్‌డీ పూర్తి చేసిన అధ్యాపకులు లేరు. ఏఐసీటీఈ మాత్రం ‘స్వయం’ (ఆన్‌లైన్‌) 20 కోర్సులు పూర్తి చేసిన వారు సీఎస్‌ఈ, వాటి ఆధారిత కోర్సుల్లో అధ్యాపకులుగా ఉండొచ్చని నిర్దేశించింది. ఈ కోర్సులు చేసి అధ్యాపకులుగా చెలామణి అవుతున్నారు. 

ఫలితంగా ఈ కోర్సులవిద్యార్థులకు తగిన శిక్షణ కల్పించలేని పరిస్థితి నెలకొంది. విద్యార్థులు అధికంగా కంప్యూటర్‌ సైన్సెస్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నా.. అందుకు అనుగుణంగా అధ్యాపకులు లేకపోవడంతో నైపుణ్యాల కొరత వేధిస్తోంది. సాఫ్ట్‌వేర్‌ కొలువులకు వెళ్లే అభ్యర్థులను నిమిషాల వ్యవధిలోనే కొత్త కోడ్‌ రాయాలని బహుళ జాతి కంపెనీలు నిర్దేశించి.. ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. దీంతో సదరు అభ్యర్థులు నైపుణ్యాల లేమికారణంగా ఇంటర్వ్యూల్లో విఫలమవుతున్నారు.  

కోర్‌ కోర్సులతో భవిత పదిలం 
సాఫ్ట్‌వేర్‌ రంగం ట్రెండ్‌ మారొచ్చు. ఎంత టెక్నాల­జీ మారినా భౌతిక నిర్మాణాలు, యంత్రాలు, విద్యుత్‌ వ్యవస్థలు ఎప్పటికీ అవసరమే. బుల్లెట్‌ రైళ్లు, స్మార్ట్‌ నగరాలు, మెగా ప్రాజెక్ట్‌ల నిర్మాణం కోర్‌ ఇంజినీర్ల ద్వారానే సాధ్యమవుతాయి. పవర్‌ గ్రిడ్‌ నిర్వహణ, ఎలక్ట్రికల్‌ వాహనాలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తా­యి. కోర్‌ బ్రాంచ్‌ కోర్సులు పూర్తి చేస్తే తొలుత తక్కువ ఉన్నప్పటికీ భవిష్యత్తులో మంచి వేతనాలు అందుకుంటారు.    –ప్రొఫెసర్‌ బి. దుర్గాప్రసాద్, డైరెక్టర్‌ ఆఫ్‌ అకడమిక్‌ అండ్‌ ఆడిట్, జేఎన్‌టీయూ అనంతపురం

సీఎస్‌ఈ వైపు వెళ్లడం మంచిది కాదు 
కోర్‌ బ్రాంచ్‌ల వైపు వెళ్తే రెండు విధాలుగా అవకాశం ఉంటుంది. సాఫ్ట్‌వేర్‌ వైపు వెళ్లొచ్చు. లేదా మౌలిక సదుపాయాల రంగాల్లో ఉద్యోగాలు దక్కుతాయి. సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారు స్వయంగా ఎదిగే అవకాశం ఉంటుంది. విదేశాల్లోనూ ఉపాధి అవకాశాలు దక్కుతాయి. 100కు 80 మంది కంప్యూటర్‌ సైన్సెస్‌ చదువుతున్నారు. ఏఐ రావడంతో ఉపాధిపై దెబ్బ పడుతోంది. ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ (ఐఈఎస్‌) వైపు వెళ్లడం లేదు. అంకితభావంతో కృషి చేస్తే  సర్వీసెస్‌లో కొలువు సాధించవచ్చు.      – డాక్టర్‌ బి.రమేష్‌ బాబు,
ప్రిన్సిపాల్, పీవీకేకే కళాశాల    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement