సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు అభ్యర్థుల హవా | Up to 50 Top Rankers from AP and Telangana in Civils‌ | Sakshi
Sakshi News home page

సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు అభ్యర్థుల హవా

Aug 5 2020 4:28 AM | Updated on Aug 5 2020 11:29 AM

Up to 50 Top Rankers from AP and Telangana in Civils‌ results - Sakshi

సూర్యతేజ 76వ ర్యాంక్, రుషికేష్‌రెడ్డి 95వ ర్యాంక్, ధాత్రిరెడ్డి 46వ ర్యాంక్, కె.రవితేజ 77వ ర్యాంక్‌

సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ/కడప ఎడ్యుకేషన్‌/మైదుకూరు: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ వంటి అత్యున్నత సర్వీసుల పోస్టులకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌–2019 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు విజయఢంకా మోగించారు. 100లోపు ర్యాంకుల్లో ఐదుగురు తెలుగువారున్నారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో దాదాపు 50 మంది వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఆయా సర్వీసులకు ఎంపికయ్యారు. గతంలో కంటే ఈసారి పోస్టులు తక్కువ ఉన్నా ఎక్కువ మంది తెలుగు అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. దేశవ్యాప్తంగా మొత్తం 829 మంది ఐఏఎస్, ఐపీఎస్, తదితర కేడర్‌ పోస్టులకు, గ్రూప్‌ఏ, గ్రూప్‌ బి సర్వీసులకు ఎంపికయ్యారు.

సొంత ప్రణాళికలతోనే..
సొంతంగా ప్రిపేర్‌ అవుతూ ఆర్‌సీ రెడ్డి టెస్ట్‌ సిరీస్‌ రాశాను. సొంత ప్రణాళికను రూపొందించుకొని 76వ ర్యాంక్‌ సాధించా. 
    – మల్లవరపు సూర్యతేజ, గుంటూరు, (76వ ర్యాంక్‌) 

నాలుగో ప్రయత్నంలో అత్యుత్తమ ర్యాంక్‌
సివిల్స్‌ మూడో ప్రయత్నం (2017)లో ఐఆర్‌ఎస్‌ సాధించాను. సివిల్స్‌ కోసం రోజూ 8 నుంచి 9 గంటలపాటు ప్రణాళికాబద్ధంగా చదివాను.   
 – రుషికేశ్‌రెడ్డి, కడప (95 ర్యాంకు)

మంచి సేవ చేయొచ్చనే..
నాలుగో ప్రయత్నంలో 103వ ర్యాంకు సాధించాను. సివిల్స్‌ ద్వారా దేశానికి మంచి సేవ చేయవచ్చు.        
 –సత్యసాయి కార్తీక్, కాకినాడ

ఆరో ప్రయత్నంలో 117వ ర్యాంకు 
మాది.. వ్యవసాయ కుటుంబం. ఐదుసార్లు సివిల్స్‌ రాసినా ఫలితం దక్కలేదు. నిరాశ చెందకుండా ఆరో ప్రయత్నంలో 117వ ర్యాంక్‌ సాధించాను.     
    – రాహుల్‌కుమార్‌ రెడ్డి, పెండ్లిమర్రి, వైఎస్సార్‌ జిల్లా

ప్రభుత్వ పాఠశాలలోనే చదివా..
మా నాన్న.. రైతు. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివా.   
– శివగోపాల్‌రెడ్డి, (263వ ర్యాంక్‌) మైదుకూరు

Advertisement
 
Advertisement
Advertisement