రాజంపేటలోని బుడ్డాయ్యపల్లెలోని పొలాల్లో వెలుగులోకి విజయనగర కాలానికి చెందినదిగా గుర్తింపు
కడప ఎడ్యుకేషన్: కడప జిల్లా రాజంపేటలోని బుడ్డాయ్యపల్లె పొలాల్లో 15వ శతాబ్దం నాటి సతి వీరగల్లు శిల్పం బయటపడింది. ఈ శిల్పం యుద్ధంలో మరణించిన వీరుల త్యాగాన్ని.. వారి భార్యల సతీసహగమనాన్ని స్మరించుకుంటూ ఏర్పాటు చేసినదిగా మైదుకూరుకు చెందిన రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ తెలిపారు. శిల్పశైలి, వస్త్రధారణను బట్టి విజయనగర కాలానికి చెందినదిగా గుర్తించారు.
శిల్పం విశేషాలు..
మధ్యలో ఉన్న వీరుడు తన రెండు పాదాలను కుడివైపు తిప్పి ఏకముఖ పాదవిన్యాసంలో ఉన్నాడు. ఇది ఆయనలోని శౌర్యాన్ని సూచిస్తోంది. వీరుని ముఖం కొంత ఛిద్రమైనా తలపై కేశబంధం, చెవులకు లోలాకులు, నడుము నుంచి పాదాల వరకు వస్త్రధారణ, ఎడమ చేతిని ఎడమవైపు కిందికి ఉంచినట్లు, కుడి చేతిలో ఖడ్గం ధరించి కింది వైపు పట్టుకున్నట్లు శిల్పం ఉంది.
కుడివైపు సతి సమపాద స్థానకంలో నిల్చుని ఉందని చరిత్రకారుడు రమేష్ తెలిపారు. తలపై కుంతలం, పెద్ద లోలాకులు, సన్నని నడుముతో శిల్పి ఆమెను అత్యంత సుందరంగా మలిచారు. ఈమె కుడి చేతిలో కలశం, ఎడమ చేతిలో కమల మొగ్గ ధరించి ఉందని చెప్పారు. ఎడమవైపు సతి అర్ధవైతస్థితిక స్థానకంలో నిలుచుని ఉందని తెలిపారు. కుడి చేతిని నడుము కింద ఆనించి కటిహస్త ముద్రలో ఉండటం భర్త పట్ల ఆమెకున్న అచంచల నిశ్చయాన్ని చాటుతోందని చరిత్రకారుడు రమేష్ చెప్పారు.


