భారత్‌ భద్రతకు ‘ఇస్రో’ భరోసా..! | 150 satellite launches in the next three years | Sakshi
Sakshi News home page

భారత్‌ భద్రతకు ‘ఇస్రో’ భరోసా..!

Apr 27 2025 4:59 AM | Updated on Apr 27 2025 9:50 AM

150 satellite launches in the next three years

వచ్చే మూడేళ్లలో 150 ఉపగ్రహ ప్రయోగాలు

సూళ్లూరుపేట:  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) దేశ భద్రత అవసరాల కోసం రాబోయే మూడేళ్లలో 150 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది.  సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లో ఒకేసారి నాలుగు రాకెట్లు అనుసంధానానికి వీలుంది. అలాగే తమిళనాడులోని కులశేఖరపట్నంలో నిర్మాణంలో ఉన్న ప్రయోగ కేంద్రాన్ని కూడా ఈ ఏడాదిలోపు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటి ద్వారా త్వరతిగతిన ఉగప్రహ ప్రయోగానికి అవకాశం లభిస్తోంది.  

కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలకు ప్రాధాన్యత 
ఇంటర్‌నెట్‌ విస్తరణ నేపథ్యంలో నెట్‌వర్క్‌ కెపాసిటీ పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకోసం కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలను అధిక సంఖ్యలో ప్రయోగించాలనే ప్రణాళిక రూపొందించారు. భారతదేశానికి దాదాపు 7,500 కిలోమీటర్ల మేర తీరరేఖ ఉండటంతో, తీరప్రాంతాల్లో నిఘా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 55 ఉపగ్రహాలు అవసరాలను తీర్చలేకపోవడంతో, కొత్త ఉపగ్రహాల కోసం ఇస్రో భారీ ప్రణాళికను రూపొందించింది. 

కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తున్న నేపథ్యంలో,  150 ఉపగ్రహాల భద్రతకు సంబంధించి కమ్యూనికేషన్, రిమోట్‌ సెన్సింగ్‌ అవసరాల కోసం ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు వేగంగా పనిచేస్తున్నారు. అంతేకాదు, కేంద్రం చేపట్టిన సంస్కరణల వల్ల అంతరిక్ష పరిశోధన, ఉపగ్రహ రూపకల్పన, ప్రయోగాల్లో ప్రైవేట్‌ రంగం భాగస్వామ్యాన్ని కూడా పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. 

మే నుంచి బిజీబిజీ.. 
ఇస్రో మే నెల నుంచి వరుసగా నాలుగు ముఖ్యమైన ప్రయోగాలకు సిద్ధమవుతోంది. ముందుగా మే మొదటి వారంలో జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌16 ప్రయోగాన్ని నిర్వహించిన అనంతరం, మిగిలిన మూడు ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యాంశాలు పరిశీలిస్తే,  మొదటి ప్రయోగ వేదికపై పీఎస్‌ఎల్‌వీ–సీ61 రాకెట్‌ ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

రెండో ప్రయోగ వేదికకు అనుసంధానంగా ఉన్న మొదటి అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్‌16 ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రెండవ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో గగన్‌యాన్‌–1 ప్రయోగానికి ఎల్‌వీఎం3–జీ1 రాకెట్‌ సిద్ధమవుతోంది. సాలిడ్‌స్టేజ్‌ అసెంబ్లింగ్‌ బిల్డింగ్‌లో ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్‌ అనుసంధానం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

జీ–20 అవసరాలపై దృష్టి 
జీ–20 దేశాల అవసరాల మేరకు వాతావరణ మార్పు­లపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక ఉపగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో 50 శాతం వ్యయాన్ని భారత్,  మిగతా 50 శాతం వ్యయాన్ని జీ–20 దేశాలు భరించనున్నాయి.  

అంతరిక్ష యాత్ర లక్ష్యం 
ఇక మానవ సహిత అంతరిక్ష యాత్రకు కూడా ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా చంద్రయాన్‌– 4 మిషన్‌ ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంగారక గ్రహంపై మరింత లోతుగా అధ్యయనం చేయడానికి మంగళ్‌యాన్‌–2 మిషన్, అలాగే శుక్రగ్రహ ఉపరితలం, వాతావరణంపై అధ్యయనం చేయడానికి శుక్రయాన్‌ మిషన్‌ కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement