కణేకల్లు: మండల కేంద్రంలోని సంజయ్నగర్ స్కూల్లో ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా చేశారు. సంజయ్నగర్ స్కూల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఏకోపాధ్యాయుడున్నారు. ఏడాదిన్నర నుంచి అదనపు ఉపాధ్యాయుడిని నియమించాలని విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం స్కూల్ ఎదుట ధర్నా చేశారు. అధికారులు స్పందించే వరకు ధర్నా విరమించమని తేల్చిచెప్పారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ భవానీశంకర్ స్కూల్ వద్దకు చేరుకొని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఎంఈఓపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిన్నర నుంచి సమస్య చెబుతున్నా పట్టించుకోని మీరు ఇప్పుడు పరిష్కరిస్తామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎంఈఓ భవానీశంకర్ డిప్యూటీ డీఈఓ లక్ష్మణ్ణకు ఫోన్ చేసి సమస్యను తెలిపారు. పది రోజుల్లో అదనపు ఉపాధ్యాయుని నియమాకానికి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఈఓ హామీచ్చారు. పదిరోజుల్లో మాట నిలబెట్టుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని తల్లిదండ్రులు హెచ్చరించారు.


