ఉరవకొండ: ఉరవకొండ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ప్రాంగణంలో బాంబు ఉందంటూ సోమవారం మెయిల్ రావడం కలకలం రేపింది. సమాచారం తెలియగానే లాయర్లు, కోర్టు సిబ్బంది, ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఎస్ఐ జనార్దన్ నాయుడు తన సిబ్బందితో కోర్టుకు చేరుకుని సోదాలు చేశారు. అయితే ఎక్కడా బాంబు ఆనవాళ్లు కనిపించలేదు. కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడం ఇది మూడోసారి. మెయిల్ పంపిన వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ క్రైం పోలీసులను రంగంలోకి దింపనున్నట్లు ఎస్ఐ తెలిపారు.


