ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి
అనంతపురం టౌన్: చంద్రబాబు ప్రభుత్వం తాజాగా పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడుతో జనం బెంబేలెత్తిపోతున్నారు. వ్యాపారాలు లేక రియల్టర్లు కొత్త వెంచర్లు వేయడమే మానేశారు. ఇలాంటి తరుణంలో మళ్లీ భూముల మార్కెట్ విలువను పెంచేశారు. స్వల్పమంటూనే భారీగా బాదేశారు. దీనికి అనుగుణంగా రిజిస్ట్రేషన్లు, స్టాంప్ డ్యూటీ చార్జీలు పెరిగిపోనున్నాయి. చదరపు గజానికి కొన్ని ప్రాంతాల్లో రూ.1,000 చొప్పున, అర్బన్ ప్రాంతాల్లో రూ.2 వేల చొప్పున పెంచేశారు. ఇది 10 నుంచి 20 శాతం మేర పెరిగినట్లు. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడిపోతున్న జనంపై ప్రభుత్వం ‘బాదుడు’ కొనసాగిస్తోంది. రూరల్ ప్రాంతాల్లో ఒక సెంటు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువపై పెరిగిన విలువతో దాదాపు రూ.48 వేలకు పైగా అదనంగా భారం పడనుంది. అర్బన్ ప్రాంతాల్లో దాదాపు రూ.97 వేల మేర పెరగనుంది. ఈ భూముల విలువల పెంపుతో రియల్ ఎస్టేట్ రంగం మరింతగా క్షీణించిపోయే ప్రమాదం ఉంది. దీంతోపాటు గుంతకల్లు, కళ్యాణదుర్గం, తాడిపత్రి, గుత్తి, రాయదుర్గం తదితర మున్సిపాలిటీల పరిధిలో 15 శాతానికి పైగా మార్కెట్ విలువలు పెరగనున్నాయి. నగర పంచాయతీలకు, మున్సిపాలిటీల దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ భూములపై సైతం 10 నుంచి 15 శాతం మేర మార్కెట్ విలువలు పెరగనున్నాయి.
స్వల్పమంటూనే రిజిస్ట్రేషన్ల చార్జీలు పెంచేశారు
అర్బన్లో గజానికి రూ.వెయ్యి చొప్పున సెంటుకు రూ.48వేలు పెంపు
ఇప్పటికే పెరిగిన మార్కెట్ విలువలతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు


