
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ భవన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్న కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. అర్జీతో పాటు ఫోన్, ఆధార్ నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. సమర్పించిన అర్జీ పరిష్కార స్థితి గురించి కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు.
జాషువా సాహిత్యంపై
రోజంతా చర్చించినా తక్కువే
● మంత్రి సత్యకుమార్ యాదవ్
అనంతపురం టవర్క్లాక్: కవి గుర్రం జాషువా సాహిత్యం గురించి రోజంతా చర్చించినా తక్కువే అవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నగరంలో ఆదివారం నిర్వహించిన జాషువా 130వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఆర్ట్స్ కళాశాల వద్ద జాషువా విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం అలెగ్జాండర్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడారు. గుర్రం జాషువా తెలుగుజాతి ముద్దు బిడ్డ అన్నారు. ఆయన కవిత్వం ఎంత విస్తారమో అంత వైవిధ్యమన్నారు. ప్రతీ అంశాన్ని తనదైన శైలిలో మలిచి తెలుగు సాహిత్యానికి కొత్త దిశను చూపార న్నారు. అలాంటి మహానుభావుడు తెలుగు వారు కావడం మన అదృష్టమన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిసె దేవానంద్, జిల్లా అధ్యక్షుడు రాజేష్, నాయకులు చిరంజీవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కుస్తీ విజేత ‘అనంత’
● ద్వితీయస్థానంలో చిత్తూరు, తృతీయ స్థానంలో శ్రీసత్యసాయి జిల్లాలు
హిందూపురం టౌన్: రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల విజేతగా అనంతపురం నిలిచింది. ద్వితీయ స్థానంలో తిరుపతి, తృతీయ స్థానంలో శ్రీసత్యసాయి జిల్లాలు నిలిచాయి. హిందూపురంలో రెండురోజులుగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ 5వ రాష్ట్రస్థాయి కుస్తీ చాంపియన్షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. అన్ని జిల్లాల నుంచి 106 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 36 కేటగిరీల్లో పోటీలు జరిగాయి. ఇందులో 36 మంది విజేతలుగా నిలిచారు. వీరు నవంబర్ ఒకటో తేదీ నుంచి అయోధ్యలో నిర్వహించే జాతీయస్థాయి కుస్తీ పోటీల్లో పాల్గొననున్నారు.
సైకిల్పై నుంచి పడి
బాలుడి మృతి
యాడికి: సైకిల్ తొక్కుతూ కింద పడి బాలుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో జరిగింది. వివరాలు.. మండల కేంద్రంలో కూల్ డ్రింకు షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న అశోక్కు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు మదన్ సాయి (15) కర్నూలులో 10వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవుల నేపథ్యంలో ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి తమ కూల్ డ్రింక్ షాపు వద్దకు సైకిల్లో బయలుదేరిన మదన్సాయి కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే వాహనంలో కర్నూలు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందాడు. కుమారుడి అకాల మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగి పోయారు.

నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’

నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’