
యువకుడిపై పోక్సో కేసు
అనంతపురం: నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పిన మోసం చేసిన యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ శ్రీకాంత్యాదవ్ తెలిపారు. ఆత్మకూరు మండలం గొరిదిండ్లకు చెందిన బోయ పోతులయ్య ఈ నెల 11న బాలికను తీసుకుని వెళ్లిపోయాడు. తమ కూతురు కనిపించడం లేదని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. రెండు రోజుల తర్వాత బాలిక అనంతపురం చేరుకుంది. తనకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడని ఫిర్యాదు ఇవ్వడంతో పోతులయ్యపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.
గుత్తిలో మరొకటి...
గుత్తి: పట్టణంలో రమేష్ అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. ఇతడు కొంతకాలంగా ఓ బాలికను వేధిస్తున్నాడు. రోజురోజుకూ వేధింపులు తారస్థాయికి చేరుకుంటుండటంతో బాలిక తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రమేష్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు.
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
గుంతకల్లు: గుంతకల్లు–బళ్లారి సెక్షన్లోని బెవనహల్–టి.సాకిబండ రైల్వేస్టేషన్ మధ్య 55 నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు గల వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు జీఆర్పీ ఎస్ఐ మహేంద్ర తెలిపారు. శరీరంపై రక్తగాయాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రమాదవశాత్తూ రైలు నుంచి కింద పడి మృతి చెంది ఉంటాడని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మృతని వద్ద ఎలాంటి ఆధారాలూ లభించలేదన్నారు. ఆచూకీ తెలిసిన వారు 98661 44616కు సమాచారం అందిచాలని ఎస్ఐ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు తోపుదుర్తి విద్యార్థినులు
ఆత్మకూరు: తోపుదుర్తి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపికై నట్లు పీడీ శ్రీవాణి తెలిపారు. శనివారం ఎస్కే యూనివర్సిటీ వద్ద లక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లాస్థాయి స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో అండర్ –19 విభాగంలో బ్లెస్సీ, లిఖిత, అండర్ –17విభాగంలో రాజేశ్వరి ఎంపికయ్యారని తెలియజేశారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థినులను హెచ్ఎమ్ సాంబశివారెడ్డి అభినందించారు.
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
పెద్దపప్పూరు: ట్రాక్టర్ (కంప్రెజర్) బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. చిక్కేపల్లికి చెందిన కురబ శంకరయ్య (40) కంప్రెజర్ ట్రాక్టర్కు డ్రైవర్గా పనిచేస్తున్నారు. శనివారం పెద్దపప్పూరుకు వెళ్తుండగా నామనాంకపల్లి – షేక్పల్లి గ్రామాల మధ్యకు రాగానే వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో శంకరయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగేంద్రప్రసాద్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు.

యువకుడిపై పోక్సో కేసు

యువకుడిపై పోక్సో కేసు