
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వివరాలు..
కళ్యాణదుర్గం రూరల్: రాయదుర్గం మండలం మల్లాపురం గ్రామానికి చెందిన వన్నూరుస్వామి (39) ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున అనంతపురం నుంచి ఆటోలో రాయదుర్గం వైపు బయలుదేరిన వన్నూరు స్వామి కళ్యాణదుర్గం మండలం గోళ్ల సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వేగంగా దూసకొచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వన్నూరు స్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పుట్లూరు: మండలంలోని సి.వెంగన్నపల్లి గ్రామానికి చెందిన అంబటి సుధాకరరెడ్డి (38)కి భార్య హైమావతి, ఓ కుమార్తె ఉన్నారు. సిమెంట్ పరిశ్రమలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ నేపథ్యంలో గురువారం విధులకు వెళ్లేందుకు సిద్ధమైన సుధాకరరెడ్డి ద్విచక్ర వాహనంపై తాడిపత్రి వైపుగా వెళుతుండగా పుట్లూరు మండలం శనగలగూడురు వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన సుధాకరరెడ్డిని వెంటనే తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి తీసుకెళుతుండగా మార్గ మధ్యంలో మృతిచెందాడు. ఘటనపై పుట్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏమార్చి ఏటీఎం నుంచి నగదు డ్రా
గార్లదిన్నె: బ్యాంక్ ఖాతాదారుడిని ఏమార్చి అతని ఏటీఎం ద్వారా నగదు డ్రా చేసుకున్న ఘటన గార్లదిన్నెలో కలకలం రేపింది. వివరాలు.. గార్లదిన్నె మండలం కొట్టాలపల్లికి చెందిన పురుషోత్తం గురువారం బుక్కరాయసముద్రం మండలం వడియంపేటలోని ఏటీఎంలో నగదు డ్రా చేసేందుకు వెళ్లాడు. అయితే నగదు రాకపోవడంతో అక్కడే ఉన్న గుర్తు తెలియని వ్యక్తి సాయాన్ని కోరాడు. ఆ సమయంలో పురుషోత్తం వద్ద ఏటీఎం కార్డు తీసుకుని యంత్రంలో ఉంచిన అనంతరం పిన్ నంబర్ నమోదు చేస్తుండగా గుర్తించాడు. నగదు డ్రా కాకపోవడంతో మాటల్లో మభ్య పెడుతూ ఏటీఎం కార్డు మరోకటి చేతికి ఇచ్చి అక్కడి నుంచి జారుకున్నాడు. దీంతో పురుషోత్తం గార్లదిన్నెకు చేరుకోగానే తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.22 వేలు నగదు డ్రా అయినట్లుగా మొబైల్కు మెసేజ్ అందింది. దీంతో వెంటనే గార్లదిన్నె యూనియన్ బ్యాంకు మేనేజర్ను సంప్రదించగా ఖాతాను పరిశీలించారు. ఒకే రోజు మూడు సార్లు ఏటీఎం ద్వారా రూ.22 వేలు నగదు డ్రా చేసినట్లు తెలిపారు. దీంతో తన వద్ద ఉన్న ఏటీఎం కార్డును పరిశీలించుకుంటే అది తనది కాకపోవడంతో మోసపోయినట్లుగా నిర్ధారించుకుని బ్యాంక్ ఖాతాను బ్లాక్ చేయించాడు.
బాలుడిని ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో నిందితులకు రిమాండ్
బుక్కరాయసముద్రం: మైనర్ బాలుడిని ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు సీఐ పుల్లయ్య తెలిపారు. బీకేఎస్ మండలం కొట్టాలపల్లిలో ఓ బాలుడు 2022, ఏప్రిల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి తల్లి రాజేశ్వరి ఫిర్యాదు మేరకు నలుగురు యువకులపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. పాత కేసులు త్వరగా పూర్తి చేయాలన్న ఎస్పీ ఆదేశాల మేరకు.. బాలుడు ఆత్మహత్య కేసులో లోతైన విచారణ అనంతరం నలుగురు యువకులను అరెస్ట్ చేసి గురువారం న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు.