
జేఎన్టీయూ(ఏ) కాన్స్టిట్యూట్ కళాశాలగా ‘స్కిట్’
అనంతపురం: జేఎన్టీయూ (ఏ) ‘కాన్స్టిట్యూట్’ జాబితాలోకి మరో కళాశాల చేరింది. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (స్కిట్)ని జేఎన్టీయూ కాన్స్టిట్యూట్ కళాశాలగా మార్చారు. ఇప్పటికే ఏపీఈఏపీసెట్ రెండో కౌన్సెలింగ్ జాబితాలో స్కిట్ కళాశాలను ఆప్షన్ ఇచ్చుకోవడానికి వీలుగా వెబ్సైట్లో చేర్చారు. దీనిపై వర్సిటీ ఉన్నతాధికారులకు ప్రాథమికంగా సమాచారం అందగా... ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు కూడా రానున్నాయి. 1997లో శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి ఆధ్వర్యంలో ఏర్పాటైన ‘స్కిట్’ కార్యకలాపాలు తొలుత సమర్థవంతంగా నడిచినా... కొన్నేళ్లకే అడ్మిషన్లు పడిపోయాయి. నిర్వహణ మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో ‘స్కిట్’ను జేఎన్టీయూ కాన్స్టిట్యూట్ కళాశాలగా మార్చాలంటూ 10 సంవత్సరాల నుంచి పాలకమండలి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వచ్చింది.ఇందుకు సంబంధించి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని అనుమతులు మంజూరయ్యాయి. తాజాగా కార్యరూపం దాల్చింది.
ఐదో కళాశాల..
జేఎన్టీయూ (ఏ) పరిధిలో ఇప్పటివరకూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల, ఓటీపీఆర్ఐ, పులివెందుల, కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలు కాన్స్టిట్యూట్గా ఉన్నాయి. తాజాగా స్కిట్ చేరికతో ఆ సంఖ్య ఐదుకు చేరింది. కాన్స్టిట్యూట్ కళాశాలగా రూపాంతరంతో ‘స్కిట్’కు సంబంధించిన స్థిర, చరాస్తులు అన్నీ ప్రభుత్వం ఆధీనంలోకి రానున్నాయి. కళాశాల నిర్వహణ మొత్తం జేఎన్టీయూ (ఏ) పరిధిలోకి వస్తుంది. ఇప్పటికే జేఎన్టీయూ ఉన్నతాధికారులు ‘స్కిట్’కు సంబంధించి ప్రిన్సిపాల్ నియామకం, ఫ్యాకల్టీ కేటాయింపు తదితర అంశాలపై దృష్టి సారించారు. ‘స్కిట్’లో తొలుత ఐదు బ్రాంచ్ల ఏర్పాటుకు అనుమతి పొందారు. సీఎస్డీ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (డేటా సైన్స్), సీఎస్ఈ (కంప్యూటర్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్), సీఎస్ఎం (సీఎస్ఈ–ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్), ఈసీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్), ఈఈఈ (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్)లో బ్రాంచ్కు 66 చొప్పున 330 సీట్లు అందుబాటులోకి తెచ్చారు. కోర్సు ఫీజు రూ.70 వేలుగా నిర్ధారించారు. సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో కోర్సు నిర్వహిస్తారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది.