
కొనసాగుతున్న సచివాలయ ఉద్యోగుల ధర్నా
అనంతపురం మెడికల్: కూటమి ప్రభుత్వం చేపట్టిన అసంబద్ధ బదిలీలపై సచివాలయ ఉద్యోగుల్లో నిరసన పెల్లుబికుతోంది. రెండ్రోజులుగా సచివాలయ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టిన సచివాలయ ఉద్యోగులు మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్లకార్డులు ప్రదర్శించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నోషనల్ ఇంక్రిమెంట్స్ వెంటనే అందజేయాలని, బదిలీల్లో స్థానికంగా ఉండే వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సెలవు దినాల్లోనూ తమతో పనులు చేయించుకునే వైఖరి వీడాలన్నారు. బదిలీల పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. అనంతరం డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు లక్ష్మీనారాయణ, సుధాకర్, వరప్రసాద్, మహేష్ నాయక్, వినయ్, భగీరథ రెడ్డి, జైనబ్బీ, జ్యోతిలక్ష్మి, కుళ్లాయమ్మ, విమల, మౌలాలమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ఆలయంలో చోరీ
గుత్తి రూరల్: మండలంలోని మాముడూరు గ్రామంలో వెలసిన రేవణదొడ్డి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం వేకువజామున చోరీ జరిగింది. గ్రామ శివారులోని ఆలయానికి వేసిన తాళాన్ని బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించిన దుండగులు హుండీ తాళాలను ఇనుప రాడ్తో మెండి ధ్వంసం చేశారు. అందులోని సుమారు రూ.5వేల వరకూ ఉన్న నగదును అపహరించారు. మంగళవారం ఉదయం ఆలయానికి వెళ్లిన అర్చకుడు చోరీ విషయాన్ని గుర్తించి గ్రామస్తులకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
వృద్ధుడి బలవన్మరణం
రాప్తాడు: మండలంలోని గంగలకుంట సమీపంలో మంగళవారం ఉదయం 8 గంటలకు రైలు కింద పడి ఓ గుర్తు తెలియని ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ మేరకు ధర్మవరం రైల్వే పోలీసులు తెలిపారు. సుమారు 65 నుంచి 70 మధ్య వయస్సు గల వ్యక్తి తెలుగు రంగు చొక్కా, నలుపు రంగు డ్రాయర్, బ్రౌన్ కలర్ లుంగీ ధరించాడు. అతనికి ఎడమ కాలు లేదు. రెండు చేతులు కూడా అవిటిగా ఉన్నాయి. ఆచూకీ తెలిసిన వారు 95502 16049, 99513 25345 కు సమాచారం ఇవ్వాలని రైల్వే పోలీసులు కోరారు.