
వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి
● దేవదాయశాఖ మాజీ సలహాదారు శ్రీకాంత్
అనంతపురం కార్పొరేషన్: గత ప్రభుత్వంలో బ్రాహ్మణులకు తీరని అన్యాయం జరిగిందని, ఆలయాల్లో విగ్రహాలు కొట్టేశారని, హుండీలు దోచుకున్నారని, తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలిపారంటూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్తో కూటమి ప్రభుత్వ పెద్దలు పచ్చి అపద్ధాలు మాట్లాడించారంటూ దేవదాయశాఖ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ మండిపడ్డారు. జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014–19 మధ్య కాలంలో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అప్పటి సీఎం చంద్రబాబు నడుచుకున్నారని గుర్తు చేశారు. విజయవాడ దుర్గమ్మ గుడిలో క్షుద్రపూజలు చేసి మహాపరాధానికి పాల్పడ్డారన్నారు. విజయవాడలో 30 ఆలయాలను కూల్చి వేశారన్నారు. సదాపర్తి భూములను అనుయాయులకు అప్పగించారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బ్రాహ్మణులకు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద పీట వేశారన్నారు. ఆలయాల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకున్నారన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా గత ప్రభుత్వంపై బురద చల్లడం సబబు కాదన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకుడు వెంకటేష్ పాల్గొన్నారు.