వంచకుడిపై చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

వంచకుడిపై చర్యలు తీసుకోండి

Jun 2 2025 1:52 AM | Updated on Jun 2 2025 1:52 AM

వంచకుడిపై చర్యలు తీసుకోండి

వంచకుడిపై చర్యలు తీసుకోండి

పోలీసులను ఆశ్రయించిన యువతి

న్యాయం చేయలేదంటూ సోషల్‌ మీడియా వేదికగా వీడియో

గుమ్మఘట్ట: ప్రేమ పేరుతో తనను లోబర్చుకుని మోసం చేసిన యువకుడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఓ యువతి ఆశ్రయించింది. బాధితురాలు తెలిపిన మేరకు... గుమ్మఘట్ట మండలం పూలకుంటకు చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా, వ్యవసాయ కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. వీరి పెద్ద కుమార్తె జిల్లా సరిహద్దున ఉన్న కర్ణాటకలోని మొలకాల్మూరులో ఇంటర్‌ పూర్తి చేసింది. ఈ క్రమంలో ఆమెను ప్రేమ పేరుతో సొంత గ్రామానికి చెందిన నాగప్ప, నాగమ్మ దంపతుల కుమారుడు సురేష్‌ లోబర్చుకున్నాడు. పెళ్లి పేరుతో మూడేళ్ల పాటు తన చుట్టూ తిప్పుకున్నాడు. ఆమె అడిగిన ప్రతిసారీ తన అన్న పెళ్లి జరిగేంత వరకూ ఓపిక పట్టాలని నచ్చచెబుతూ వచ్చాడు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం యువకుడి అన్నకు పైళ్లెంది. దీంతో పది రోజుల క్రితం ఆమె నిలదీయడంతో యువకుడు ముఖం చాటేశాడు. దీంతో తాను మోసపోయినట్లుగా నిర్ధారించుకున్న ఆమె విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. వారు స్పందించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుండగా తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై ఎస్‌ఐ ఈశ్వరయ్యను వివరణ కోరగా విచారిస్తున్నామని తెలిపారు.

తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం

అనంతపురం/అనంతపురం క్రైం: జిల్లా కేంద్రం చుట్టుపక్కల భూమి తమవేనంటూ తెలుగు తమ్ముళ్లు దౌర్జన్యానికి తెరలేపారు. బాధితులు తెలిపిన మేరకు... కక్కలపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 144/2ఏలో మొత్తం 1.76 ఎకరాల్లో ఆర్‌.కృష్ణారెడ్డి కుమారుడు హనుమంతరెడ్డికి 0.73 సెంట్లు, మహమ్మద్‌ షఫీ కుమారుడు సయ్యద్‌ షామీర్‌కు 0.58 సెంట్లు, మహేష్‌బాబు భార్య జి.విజయలక్ష్మికి 0.08 సెంట్లు, షేక్‌ మహబూబ్‌బాషా కుమారుడు షేక్‌ ఇమాం బాషాకు 0.08 సెంట్ల స్థలం ఉంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు గత 20 సంవత్సరాలుగా పక్కాగా ఉన్నాయి. వీటి ఆధారంగా బ్యాంక్‌ రుణాలు సైతం పొందారు. ఆ స్థలంలో నీటి బోర్లు, కాంపౌండ్‌ వాల్‌, షెడ్డు, డోర్‌ నంబర్లు, కరెంట్‌ బిల్లులూ ఉన్నాయి. గత నెల 28న సర్వేయర్‌ ఉమామహేశ్వర్‌ ఫోన్‌ చేసి హద్దులు చూపిస్తానని తెలపడంతో వారు హక్కుదారులు అక్కడకు వెళ్లారు. అప్పటికే ప్రహరీని జేసీబీతో కూల్చివేసి స్థలాన్ని కబ్జా చేసుకునే ప్రయత్నం సాగుతుంటే అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అనంతపురం నియోజకవర్గ ప్రజాప్రతినిధికి చెందిన 50 మంది అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ఆ భూమి తమదంటూ దుర్భాషలాడుతూ హక్కుదారులను పక్కకు లాగేశారు. బాధితులు వెంటనే డయల్‌ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని కూల్చివేతలను అడ్డుకున్నారు. కానీ, ఇప్పటి వరకూ దౌర్జన్యపరులపై ఎలాంటి చర్యలూ లేవు. అలాగే కియా కార్ల షోరూం వెనుక ఉన్న ఎకరాలోపు స్థలంలో కుటుంబ సభ్యులపై అనంతపురం, రాప్తాడు ప్రజాప్రతినిధులకు చెందిన ముఖ్య అనుచరులు దాడి చేశారు. నగరంలోని అరవిందనగర్‌కు చెందిన వెంకటేశ్‌ ప్రసాద్‌ గుప్తాకు చెందిన ఈ స్థలం అత్యంత విలువైనది. దీనిపై కన్నేసిన టీడీపీ నేతలు శనివారం ఆ స్థలం వద్దకెళ్లి కబ్జాకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న వెంకటేశ్‌ ప్రసాద్‌ గుప్తా, అతని కుమారులు ప్రణీత్‌, సాయినాథ్‌ అక్కడకు చేరుకోవడంతో టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. ఘటనలో వెంకటేశ్‌ప్రసాద్‌ గుప్తా చెవికి తీవ్ర గాయమైంది. బాధితులు డయల్‌ 100కు సమాచారం ఇవ్వడంతో నాల్గో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే టీడీపీ నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, తీవ్రంగా గాయపడిన వెంకటేష్‌ ప్రసాద్‌ ప్రస్తుతం కర్నూలులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై నాల్గోపట్టణ సీఐ కె.సాయినాథ్‌ మాట్లాడుతూ.. భూ వివాదాలపై ప్రాథమికంగా విచారణ చేపడతామన్నారు. బాధితులకు రాత్రి, ఉదయం ఫోన్‌ చేసి విచారణకు రావాలని సూచించామని, వారిచ్చే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement