
మోసం... చంద్రబాబు నైజం
బుక్కరాయసముద్రం: ప్రజలను మోసం చేయడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగడుతూ జూన్ 4న నిర్వహించనున్న ‘వెన్నుపోటు దినం’ నిరసన ర్యాలీలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణస్వామి దేవాలయంలో పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘అనంత’ మాట్లాడుతూ సూపర్ సిక్స్ వాగ్దానాల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను చంద్రబాబు మోసగించారన్నారు. హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రెడ్బుక్ పాలన సాగిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, కేసులు, హత్యాకాండకు పాల్పడుతున్నారన్నారు. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని అరాచక పాలన సాగించడం హేయమన్నారు. మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ హామీల అమలుపై కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావడానికి ‘వెన్నుపోటు దినం’ నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 4న నార్పల మండలంలో ఆందోళన, నిరసన కార్యక్రమం ఉంటుందని, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు నరేష్కుమార్రెడ్డి, అనుబంధ సంఘాల పరిశీలకులు సురేంద్ర మాట్లాడుతూ కూటమి పాలన రాష్ట్రంలో ఎల్లకాలం ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని, ఎవరూ అధైర్య పడరాదని సూచించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ నరేష్, జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్, మేజర్ పంచాయతీ సర్పంచ్ పార్వతి, గువ్వల శ్రీకాంత్రెడ్డి, నాగలింగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గువ్వల శ్రీకాంత్రెడ్డి, పూల నారాయణస్వామి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు వెంకటరెడ్డి, చికెన్ నారాయణస్వామి, సాకే నారాయణస్వామి, అనంత వెంకటరెడ్డి, కాటమయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
వెన్నుపోటు దినం నిరసన ర్యాలీని విజయవంతం చేద్దాం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, మాజీ మంత్రి శైలజానాథ్