
బహిర్గతమైన ‘కూటమి’ విభేదాలు
అనంతపురం: ఉమ్మడి జిల్లాలో కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. టీడీపీకి చెందిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అవినీతి అక్రమాలను బహిర్గతం చేస్తానని బీజేపీకి చెందిన ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ మంగళవారం అనంతపురం నగరంలో ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. అలాగే రుద్రంపేట సర్కిల్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో రౌండ్టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి బీసీలను పల్లె వంచిస్తున్న తీరుపై చర్చించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఫంక్షన్ హాల్ వద్దకు ఆయన చేరుకోగానే పెద్ద సంఖ్యలో పల్లె అనుచరులు అక్కడకు చేరుకుని భయభ్రాంతులకు గురి చేశారు. ఇరువర్గాలు బాహా బాహీకి దిగాయి. నడిరోడ్డుపైనే తోపులాట చోటు చేసుకుంది. ప్రెస్మీట్, రౌండ్టేబుల్ సమావేశం విరమించుకుని వెళ్లకపోతే దారుణమైన పరిస్థితులు చూడాల్సి ఉంటుందని పల్లె అనుచరులు హెచ్చరికలు జారీ చేశారు. ఇంతలోనే పల్లె రఘునాథరెడ్డికి మద్దతుగా అక్కడకు చేరుకున్న పోలీసులు ఎలాంటి ప్రెస్మీట్లు పెట్టడానికి వీల్లేదంటూ ఆదినారాయణయాదవ్ను అడ్డుకున్నారు. అనంతరం ప్రెస్క్లబ్లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పల్లె రఘునాథరెడ్డి భూమిని కబ్జా చేశారని ఆదినారాయణ యాదవ్ అనుచరులు ఆరోపించారు. అల్లరిమూకలను రెచ్చగొట్టి పదేపదే బీసీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. సోలార్ ప్రాజెక్ట్ కోసమని 100 ఎకరాల గిరిజనుల భూమిని ఆదినారాయణ యాదవ్ లాక్కొన్నారని పల్లె అనుచరులు ఆరోపించారు. ఇలా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ కూటమిలోని విభేదాలను బయటపెట్టారు.
అనంతలో ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ ప్రెస్మీట్ను అడ్డుకున్న పోలీసులు
పల్లె రఘునాథరెడ్డి అవినీతిపై రౌండ్టేబుల్ సమావేశం ఏర్పాటు
పోలీసుల అండతో అడ్డుకున్న పల్లె అనుచరులు