
ఉద్రిక్తత నడుమ సేవ్ ఆర్డీటీ
●ఆర్డీటీ పరిరక్షణ పాదయాత్రను అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు ●ఉద్రిక్తతల మధ్య సాగిన మొదటి రోజు పాదయాత్ర
కళ్యాణదుర్గం/ బెళుగుప్ప: కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య పిలుపు మేరకు బుధవారం చేపట్టిన ఆర్డీటీ పరిరక్షణ పాదయాత్రను పోలీసులు అడ్డుగడుగునా అడ్డుకున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు బెళుగుప్ప మండలం గొంచితండా నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. భారీ సంఖ్యలో హాజరైన పార్టీ శ్రేణులు, ఆర్డీటీ లబ్దిదారులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతులు లేవంటూ గొంచితండా నుంచి బ్రాహ్మణపల్లి వరకూ అడుగడుగునా కళ్యాణదుర్గం, గుంతకల్లు, డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, పెద్ద సంఖ్యలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు వాహనాలను రహదారికి అడ్డంగా పెట్టారు. పాదయాత్రను భగ్నం చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. ఒకానొక దశలో ఒక్కసారిగా తలారి రంగయ్యను చుట్టుముట్టి బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపు తప్పి ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగయ్యను తమ భుజాల మీదకు ఎత్తుకుని పోలీసుల వలయాన్ని ఛేదించుకుని కార్యకర్తలు ముందుకు సాగారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ తొలి రోజు పాదయాత్ర గొంచి తండా నుంచి రాయదుర్గం – కళ్యాణదుర్గం ప్రధాన రహదారి మీదుగా కొత్త బ్రాహ్మణపల్లి, పాత బ్రాహ్మణపల్లి, నరసాపురం, బ్రహ్మసముద్రం మండలం కుర్లగుండ గ్రామం వరకూ సాగింది.
ఆర్డీటీ పరిరక్షణ అందరి బాధ్యత
గొంచితండాలో ఏర్పాటు చేసిన పాదయాత్ర ప్రారంబోత్సవ సభలో తలారి రంగయ్యతో పాటు పార్టీ జిల్లా అద్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, ఉరవకొండ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, రాయదుర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాదవ్, జెడ్పీ చైర్పర్రసన్ బోయ గిరిజమ్మ, రాష్ట్ర నాయకులు మహాలక్ష్మి శ్రీనివాస్, ఉమామహేశ్వరనాయుడు, తిప్పేస్వామి, చందన శివాజీ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్డీటీ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. కరువు జిల్లా అనంతలో పేదరికం రూపుమాపేందుకు 50 సంవత్సరాలుగా ఆర్డీటీ చేస్తున్న కృషిని కొనియాడారు. ఆర్డీటీ సేవలను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు సరైంది కాదన్నారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆర్డీటీకి ఎప్సీఆర్ఏను రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారు. రమనేపల్లి సర్పంచ్ రమేష్, నరసాపురం ఎంపీటీసీ సురేష్, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, పార్టీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిదులు, వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల నాయకులు, ఆర్డీటీ లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఉద్రిక్తత నడుమ సేవ్ ఆర్డీటీ