
తారస్థాయికి దాహం కేకలు
కూడేరు: మండల పరిధిలోని పీఏబీఆర్ వద్ద ఏర్పాటైన శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ నుంచి సీపీడబ్ల్యూఎస్ పథకం ద్వారా మంచినీటి సరఫరా 8 రోజులుగా ఆగిపోయింది. ప్రాజెక్ట్లో మోటర్లకు ఏర్పాటు చేసిన ప్యానెల్ బోర్డు పని చేయకుండా పోయింది. కాంట్రాక్టర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు మరమ్మతుల గురించి పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొలాలు, ఏటి వద్ద నుంచి ద్విచక్ర వాహనాలు, ఎద్దుల బండ్లు, ఆటోలు, ట్రాక్టర్లలో అవస్థలు పడుతూ నీటిని తెచ్చుకుంటున్నారు. కూడేరు మండలంలో సుమారు 42 వేల మందికి ‘సీపీడబ్ల్యూఎస్’ ద్వారా సరఫరా అయ్యే నీరే దిక్కు. ప్రాజెక్ట్ నుంచి పైపులైన్ ద్వారా రోజూ 3,053 కిలో లీటర్ల మంచి నీరు సరఫరా అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉరవకొండ మండలంలో కూడా కొన్ని గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారు. దాహార్తి తీర్చే ప్రాజెక్ట్ నుంచి ఉన్నట్లుండి నీటి సరఫరా ఆగిపోవడంతో ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. గత్యంతరం లేక సోమవారం కూడేరుకు చెందిన మహిళలు ఖాళీ బిందెలతో జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. శుక్రవారం ముద్దలాపురంలో ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు కూడా జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. శనివారం ఉదిరిపికొండ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నీటి కోసం ప్రజలు ఆందోళన చేపడుతున్నా స్పందన కరువైంది. ఇప్పటికైనా తగిన చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.
వారం రోజులుగా నిలిచిన
‘సీపీడబ్ల్యూఎస్’ నీటి సరఫరా
28 గ్రామాల ప్రజలకు ఇక్కట్లు

తారస్థాయికి దాహం కేకలు