
విద్యుత్ షాక్తో కాంట్రాక్ట్ కార్మికుడికి తీవ్రగాయాలు
గుంతకల్లు: పట్టణంలోని డీ–1 కార్యాలయంలో పోల్ టు పోల్ కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్న మస్తాన్వలి విద్యుత్ షాక్తో తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. శనివారం పాతగుంతకల్లులోని బీసీ హాస్టల్ సమీపాన విద్యుత్ స్తంభాల్లో ఏర్పడిన విద్యుత్ సమస్యను పరిష్కారించడానికి లైన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లుతో మస్తాన్వలి ఎల్సీ తీసుకున్నాడు. అనంతరం పోల్ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో మస్తాన్వలి కుడి చేతి రెండు వేళ్ల తెగిపోగా.. కుడికాలుకు పెద్ద గాయమైంది. వెంటనే అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఏడీ నాగేంద్ర మస్తాన్వలిని పరామర్శించి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
బాధ్యులపై చర్యలు తీసుకోండి
పోల్ టు పోల్ కాంట్రాక్ట్ కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి మారుతీప్రసాద్ డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మస్తాన్వలిని వారు పరామర్శించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గతంలో కూడా రాజా అనే కార్మికుడు విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రమాదాలకు గురై చాలామంది కార్మికులు మంచానపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
బాలికపై అత్యాచారం అమానుషం
అనంతపురం అర్బన్: రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో దళిత బాలికపై జరిగిన అత్యాచారం అమానుషమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్ అన్నారు. శనివారం అనంతపురంలోని గణేనాయక్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఘటనకు కారణమైన వారు ఏ పార్టీకి చెందినవారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత బాలిక కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. పేదరికాన్ని, సామాజిక వెనుకబాటును అవకాశంగా తీసుకుని దళిత బాలికపై ఆరు నెలలుగా 14 మంది అత్యాచారానికి పాల్పడడం సభ్య సమాజానికే సిగ్గుచేటన్నారు. నిస్సహాయ బాధిత బాలికకు అండగా నిలవాల్సిన సమయంలో ప్రధాన రాజకీయ పార్టీలు విమర్శలు చేసుకోవడం నిందితులకే తోడ్పుతుందనే విషయం గుర్తించాలన్నారు. ఈ దుర్మార్గ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు.
అలకబూని.. ఇంటి నుంచి వెళ్లిపోయిన విద్యార్థి
ధర్మవరం అర్బన్: ఎంసెట్ మార్కుల విషయంలో తల్లిదండ్రులు మందలించారని ఓ విద్యార్థి అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని వెతికి పట్టుకొచ్చి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని టీచర్స్కాలనీకి చెందిన నారాయణస్వామి కుమారుడు రాజు ఇటీవల ఎంసెట్ రాశాడు. పరీక్ష కీ ఆధారంగా 35 మార్కులు వచ్చాయి. సరిగా చదవలేదంటూ తల్లిదండ్రులు మందలించడంతో అలిగిన రాజు శుక్రవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తెలిసిన చోట్లల్లా వెదికినా ఎక్కడా కనపడలేదు. శనివారం ఉదయం టూటౌన్ సీఐ రెడ్డప్పకు ఫిర్యాదు చేశారు. ఆయన తన సిబ్బందితో గాలింపు చేపట్టి విద్యార్థి తన స్నేహితుడు ఇంటిలో ఉన్నాడని తెలుసుకుని, పట్టుకొచ్చి తండ్రి నారాయణస్వామికి విద్యార్థిని అప్పగించారు.

విద్యుత్ షాక్తో కాంట్రాక్ట్ కార్మికుడికి తీవ్రగాయాలు

విద్యుత్ షాక్తో కాంట్రాక్ట్ కార్మికుడికి తీవ్రగాయాలు