ఆ కార్యాలయంలోనే కిరికిరి! | - | Sakshi
Sakshi News home page

ఆ కార్యాలయంలోనే కిరికిరి!

Jun 8 2025 12:36 AM | Updated on Jun 8 2025 12:36 AM

ఆ కార్యాలయంలోనే కిరికిరి!

ఆ కార్యాలయంలోనే కిరికిరి!

అనంతపురం ఎడ్యుకేషన్‌: టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో అక్రమ పాయింట్ల విషయంలో వేళ్లన్నీ విద్యాశాఖ కార్యాలయం వైపే చూపిస్తున్నాయి. ఇప్పటికే హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్లలో కొందరు అక్రమ మార్గాన పాయింట్లతో లబ్ధి పొందారు. తాజాగా ఎస్జీటీల్లోనూ కుప్పలుతెప్పలుగా ఇదేదారిని ఎన్నుకున్నారు. తప్పుడు పాయింట్లు పొందుతున్న వారిపై కొందరు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా వారిని అలానే కొనసాగిస్తుండడం పట్ల విద్యాశాఖ ఉద్యోగులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఫిర్యాదు చేసేందుకు ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా వెనకడుగు వేస్తున్నారు.

ఇదెట్టా.. ఇదెట్టా..

ప్రభుత్వం కొత్తగా తెచ్చిన బదిలీ చట్టం మేరకు ఒక హైస్కూల్‌లో ఒక సబ్జెక్టులో 50 శాతానికి మించి ప్రిఫరెన్షియల్‌ కేటగిరీ టీచర్లు ఉండకూడదు. మరి అనంతపురంలోని కేఎస్‌ఆర్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ఆరు ఇంగ్లిష్‌ పోస్టులు ఉన్నాయి. వీరిలో ఇప్పటికే ఇద్దరు ప్రిఫరెన్షియల్‌ కేటగిరీ టీచర్లు ఉన్నారు. తాజా బదిలీల్లో మరో ఇద్దరు ప్రిపరెన్షియల్‌ కేటగిరీ టీచర్లు వచ్చారు. అంటే ఆరుగురులో నలుగురు వారే ఉన్నారు. ఇదెలా సాధ్యమో అర్థం కావడంలేదు. అందులోనూ ఓ టీచరు నిబంధనల విరుద్ధంగా ఈ కేటగిరిలోకి వచ్చాడు.

● నార్పల మండలంలో పని చేస్తున్న ఓ టీచరుకు ఎలాంటి సర్జరీ జరగలేదు. అయినా సర్జరీ చేయించుకున్నట్లు నకిలీ సర్టిఫికెట్‌ పొంది నగరంలోని ఓ స్కూల్‌కు వచ్చారు.

● ప్రభుత్వ యాజమాన్యాల స్కూళ్లల్లో పని చేస్తున్న జెడ్పీహెచ్‌ఎస్‌ టీచర్లు... తప్పనిసరి బదిలీ అయితే వారి యాజమాన్యానికే వెళ్లాలి. ఎవరైనా రిక్వెస్ట్‌గా వెళ్లాల్సి వచ్చినా వారి యాజమాన్యాలకే వెళ్లాలి, లేదంటే చివరగా తాను పని చేస్తున్న పాఠశాలకు ఆప్షన్‌ ఇచ్చుకోవాలి. అలాకాకుండా ఓ టీచరు రిక్వెస్ట్‌ బదిలీపై నగరంలోని ఓ స్కూల్‌కు వచ్చారు.

● కుందుర్పి మండలం వడ్డుపాళ్యం పాఠశాలలో పని చేసే ఓ టీచరు కాలికి శస్త్ర చికిత్స జరిగింది. 69 శాతం వరకు వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్‌ పొందారు. ఇటీవల ఈయన వైకల్యశాతం 59 ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. అదనంగా 7 స్పెషల్‌ పాయింట్లు పొందారు. ఇంత వైకల్యశాతం ఉన్న వ్యక్తి క్రికెట్‌, ఇతర క్రీడలు బ్రహ్మాండగా ఆడతాడు. ఇదెలా సాధ్యయో ఆయనకు, సర్టిఫికెట్‌ ఇచ్చిన వైద్యులకు తెలియాలి. ఈ విషయంపై ఎంఈఓను వివరణ కోరగా.. ‘‘ఆయన వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్‌ పొందుపరిచాడు కానీ క్రికెట్‌ బాగా ఆడతాడు. ఇది ఆశ్చర్యమే’’నంటూ పేర్కొన్నారు.

● కళ్యాణదుర్గం మండలంలో పని చేస్తున్న పీఎస్‌ టీచరు స్టేషన్‌ పాయింట్లు అక్రమంగా వేసుకున్నాడంటూ స్వయంగా ఎంఈఓ తన లాగిన్‌లో తొలగించి డీఈఓ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఏం జరిగిందో కానీ మండలంలో తొలగించిన పాయింట్లు జిల్లాలో యాడ్‌ అయ్యాయి. ఆ పాయింట్లతో సదరు టీచరు కాలువపల్లికి కోరుకుని బదిలీ అయ్యారు.

● విడపనకల్లు మండలంలో పని చేస్తున్న ఓ మహిళా టీచరు భర్త... ధర్మవరం రూరల్‌ పరిధిలోని ఓ స్కూల్‌లో పని చేస్తూ గతనెల 31 రిటైర్డ్‌ అయ్యారు. ఈమె నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తులో స్పౌజ్‌ పాయింట్లు వేసుకున్నారు. తర్వాత ఆమె ఆలోచించి స్పౌజ్‌ పాయింట్లు తొలగించాలంటూ అర్జీ పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాత్కాలిక జాబితాలో తొలగినా ఫైనల్‌ సీనియార్టీ జాబితాలో మళ్లీ ఆ పాయింట్లు కనిపించాయి. ఇదెలా సాధ్యం అని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఆరోపణలు రావడంతో మళ్లీ ఆ పాయింట్లను తొలగించాల్సి వచ్చింది.

విద్యాశాఖ కార్యాలయంలోనే

అక్రమాలు జరుగుతున్నాయంటున్న ఉపాధ్యాయులు

ఫిర్యాదుకు ఉపాధ్యాయ సంఘాల నేతల వెనకడుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement