
దర్శన టికెట్లపై అర్చకుల అభ్యంతరం
గుత్తి: తొండపాడు బొలికొండ రంగనాఽథస్వామి దర్శనానికి టికెట్ల విధానాన్ని ప్రవేశపెట్టడంపై అర్చకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవాలయం వద్ద శనివారం అర్చకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు, భక్తులు అధికంగా దైవ దర్శనానికి వస్తారన్నారు. కరువుకు నిలయమైన ఇలాంటి ప్రాంతంలో దైవ దర్శనానికి టికెట్ల విధానం అమలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అదీగాక అధికారులు ఏకపక్షంగా టికెట్ల విధానం అమలు చేయడానికి సిద్ధమయ్యారన్నారు. కనీసం అర్చకులు, గ్రామ పెద్దలను కూడా సంప్రదించలేదన్నారు. వెంటనే టికెట్ల విధానం యోచనను విరమించుకోవాలన్నారు.
కట్నం కోసం వేధింపులు
యాడికి: అదనపు కట్నం కోసం భర్త, మామ వేధిస్తున్నారని ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. చందన గ్రామానికి చెందిన దళవాయి ఐశ్వర్యకు నార్పల మండలం కేశేపల్లికి చెందిన కుళ్లాయప్ప కుమారుడు విష్ణువర్దన్తో ఏడాది కిందట ప్రేమ వివాహమైంది. అయితే గత కొంతకాలంగా భర్తతో పాటు మామ కట్నం తేవాలని వేధిస్తుండటంతో భరించలేకపోయిన ఐశ్వర్య పుట్టింటికి వచ్చేసింది. బంధువుల ద్వారా పంచాయితీ చేసినా సమస్య పరిష్కారం కాకపోవడం, వేధింపులు మళ్లీ పెరగడంతో ఐశ్వర్య శనివారం యాడికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.