
ఆర్డీటీ లైసెన్స్ పునరుద్ధరించేదాకా పాదయాత్ర
శెట్టూరు: పేదల కోసం పాటుపడే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి లైసెన్స్ పునరుద్ధరించిన రోజే తాను పాదయాత్ర విరమిస్తానని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య స్పష్టం చేశారు. ఆయన చేపట్టిన ఆర్డీటీ పరిరక్షణ పాదయాత్ర శనివారం శెట్టూరు మండలంలో కొనసాగింది. యాటకల్లులో పాదయాత్రకు మహిళలు, ప్రజలు, ఆర్డీటీ లబ్ధిదారులు ఘన స్వాగతం పలికారు. కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు మండలాల నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పాదయాత్రకు మద్దతునిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తలారి రంగయ్యా మాట్లాడారు. అట్టడుగు వర్గాల ప్రజలకు ఆర్థిక చేయూత.. సామాజిక గుర్తింపు, ఉచితంగా ఉన్నత చదువులు, వైద్య సేవలు, గృహనిర్మాణాలు, వ్యవసాయాభివృద్ధికి ఆర్డీటీ ఎంతగానో తోడ్పాటునందిస్తోందన్నారు. అలాంటి ఆర్డీటీకి విదేశీ నిధులు రావడం ఆగిపోతే ట్రస్టు సేవలు నిలిచిపోతాయని, అప్పుడు పేదలు మరింత దుర్భర బతుకులు వెళ్లదీయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా భయపడేది లేదన్నారు. ఆర్డీటీకి నిధులు కొనసాగేలా ఉత్తర్వులు ఇచ్చిన రోజు ధన్యవాదాలు తెలిపి తన పాదయాత్ర విరమిస్తానని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, నాయకుడు మాదినేని ఉమా మహేశ్వర నాయుడు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, మండల కన్వీనర్ ఎంఎస్ రాయుడు, ఎంపీపీ సోమనాథ్రెడ్డి, మాజీ ఎంపీపీ రామభీమప్ప, వైస్ ఎంపీపీ ముత్యాలు, చెవుల కిష్టప్ప, పార్టీ అనుబంధ నాయకులు పాల్గొన్నారు.
ఆర్డీటీ పరిరక్షణ పాదయాత్రలో
మాజీ ఎంపీ తలారి రంగయ్య

ఆర్డీటీ లైసెన్స్ పునరుద్ధరించేదాకా పాదయాత్ర