
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
కూడేరు: ఎన్సీసీ నగర్ సమీపాన అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కన చెట్ల పొదల్లో శనివారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో సీఐ రాజు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. ముఖం భాగాన్ని పురుగులు తినేయడంతో గుర్తు పట్టలేని విధంగా ఉంది. శరీరంపై ఎక్కడా గాయాలు లేవు, ఆమె చుట్టూ ఎలాంటి రక్తపు ఆనవాళ్లు లేవు. మహిళ ఎరుపు, తెలుపు రంగుతో కూడిన పంజాబీ డ్రస్ ధరించి ఉంది. 25–30 ఏళ్లలోపు వయసు ఉండొచ్చు. మహిళ మృతికి సంబంధించి పోలీసులకు ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలూ లభించలేదు. మృతదేహాన్ని బట్టి చూస్తే నాలుగైదు రోజులు క్రితం చనిపోయి ఉండవచ్చని పోలీసులు అంచనాకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. మహిళ ఆత్మహత్య చేసుకుందా? లేదా ఎక్కడైన హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఘర్షణలో యువకుడి మృతి
గార్లదిన్నె: ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. పోలీసులు, 108 సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెనకచెర్ల గ్రామానికి చెందిన దివాకర్, యశ్వంత్ శనివారం ఘర్షణ పడ్డారు. కోపోద్రిక్తుడైన దివాకర్ కట్టెతో దాడి చేయడంతో యశ్వంత్ (18) స్పృహతప్పి పడిపోయాడు. స్థానికుల సమాచారంతో 108 వాహన సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని యశ్వంత్ను అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి యశ్వంత్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘర్షణకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం