
ఆర్డీటీకి అవాంతరాలు సృష్టించడం దారుణం
శెట్టూరు: ‘ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రంలోనూ ఆర్డీటీ సేవలు అందిస్తోంది. పేద ప్రజల బాగు కోసం 55 ఏళ్లుగా నిస్వార్థంగా పనిచేస్తోంది. అలాంటి సంస్థకు అవాంతరాలు సృష్టించడం దారుణం’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ కోసం మాజీ ఎంపీ తలారి రంగయ్య చేస్తున్న పాదయాత్రకు శెట్టూరు మండలం చెర్లోపల్లిలో ‘అనంత’ సంఘీభావం తెలి పారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. రంగయ్య పాదయాత్రను టీడీపీ నాయకులు అడ్డుకోవాలని చూస్తుండటం హేయమన్నారు. పేదల బాగు కోసం కృషి చేస్తున్న ఆర్డీటీకి బీజేపీ మతం రంగు పులిమిందన్నారు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలోనే ఆర్డీటీకి నోటీస్ ఇచ్చినట్లు గుర్తుచేశారు. లోకేష్ తన పాదయాత్ర సమయంలో మాంఛో ఫెర్రర్కు తప్పకుండా సాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, బీజేపీ మంత్రి కూడా ఆ విషయాన్ని చెప్పినట్లు గుర్తుచేశారు. ఢిల్లీలో ప్రధాని మోదీని, కేంద్ర హోం మంత్రిని కలిసిన మంత్రి లోకేష్ ఆర్డీటీ గురించి ఎందుకు చెప్పలేదని నిలదీశారు. 3 నెలల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా కూటమి నేతలు పట్టించుకోవడం లేదని, వారి చేతకానితనం వల్లే ఆర్డీటీకి ఈ దుస్థితి దాపురించిందని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, పార్టీ నేత మాదినేని ఉమా మహేశ్వర నాయుడు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, ఎంపీపీ సోమనాథ్రెడ్డి, వైస్ ఎంపీపీ ముత్యాలు, పార్టీ మండల కన్వీనర్ ఎంఎస్ రాయుడుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
నేతల సంఘీభావం..
రంగయ్య పాదయాత్రకు ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మంగమ్మ, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా నేత చవ్వా రాజశేఖర్రెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు. పేదల అభ్యున్నతికి పాటుపడుతున్న ఆర్డీటీకి అండగా నిలవకపోతే కూటమి పాలకులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని వారు విమర్శించారు.

ఆర్డీటీకి అవాంతరాలు సృష్టించడం దారుణం