
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
● కలెక్టర్ వినోద్కుమార్
అనంతపురం అర్బన్: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. రెవెన్యూభవన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈఏపీసెట్లో
15,137 మంది అర్హత
అనంతపురం ఎడ్యుకేషన్: ఏపీ ఈఏపీ సెట్లో 15,137 మంది అర్హత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 10,659 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 4,478 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఆదివారం ఈ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి మొత్తం 16,658 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. 10,659 మంది అర్హత సాధించారు.
అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో...
అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించి మొత్తం 5,656 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో మొత్తం 4,478 మంది అర్హత సాధించారు.
సత్తా చాటిన నితిన్ అగ్నిహోత్రి
ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్లో సత్తా చాటిన ‘అనంత’ కుర్రాడు నితిన్ అగ్నిహోత్రి ఏపీఈఏపీసెట్లోనూ తనకు ఎదురులేదని నిరూపించాడు. 94.1576 మార్కులతో రాష్ట్రంలో 5వ ర్యాంకు సాధించి ప్రశంసలందు కున్నాడు. ఈ విద్యార్థి జేఈఈ మెయిన్స్లో 99.997 పర్సంటైల్, అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 183వ ర్యాంకు సాధించాడు. అనంతపురం నగరానికి చెందిన నితిన్ అగ్నిహోత్రి తండ్రి భూపతి శ్రీకాంత్ బిల్డర్ కాగా, తల్లి పాలసముద్రం కల్యాణి గృహిణి. ఈఏపీసెట్లో 5వ ర్యాంకు సాధించడం పట్ల సంతోషంగా ఉందని నితిన్ పేర్కొన్నాడు. అడ్వాన్స్డ్ ఫలితాల ఆధారంగా ఐఐటీ మద్రాస్లో జాయిన్ కావాలనుకుంటున్నట్లు వెల్లడించాడు.
● ఏపీ ఈఏపీసెట్ అగ్రికల్చర్,ఫార్మసీ విభాగంలో అనంతపురం నగరానికి చెందిన కూరపాటి సైనారెడ్డి సత్తాచాటింది. 300 మార్కులకు 287 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 71వ ర్యాంకు దక్కించుకుంది. ఈ అమ్మాయి విజయవాడ నారాయణ కళాశాలలో ఇంటర్ చదివింది. తండ్రి కూరపాటి నరసింహారెడ్డి విద్యాశాఖలో పీడీగా పని చేస్తుండగా, తల్లి ధనలక్ష్మీ ఐసీడీఎస్లో సూపర్వైజర్గా పని చేస్తున్నారు.
429 మందికి
ఎస్ఏలుగా పదోన్నతి
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 429 మంది ఎస్జీటీలకు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, మునిసిపల్ కార్పొరేషన్ యాజమాన్య పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ కేడర్ పదోన్నతులు లభించాయి. ఇందులో పీఎస్హెచ్ఎంలుగా 141 మంది (కన్నడ 1, తెలుగు 130, ఉర్దూ 10) ఉన్నారు. అలాగే ఎస్ఏ ఇంగ్లిష్ 46 మంది, హిందీ 01, తెలుగు 01, ఉర్దూ 01, బీఎస్ (తెలుగు) 38 మంది, బీఎస్ (ఉర్దూ) 04, గణితం (తెలుగు) 80 మంది, గణితం (ఉర్దూ) 05, పీడీ (తెలుగు) 06, పీఎస్ (కన్నడ) 01, పీఎస్ (తెలుగు) 46, పీఎస్ (ఉర్దూ) 01, సోషల్ (కన్నడ) 02, సోషల్ (తెలుగు) 50, సోషల్ (ఉర్దూ) ఆరుగురికి పదోన్నతి కల్పించారు. వీరితో పాటు ఇటీవల తప్పనిసరి, రిక్వెస్ట్ బదిలీలైన స్కూల్ అస్టెంట్లందరూ ఆదివారం వారి పాత పాఠశాలల్లో రిలీవ్ అయ్యారు. సోమవారం కొత్త స్కూళ్లల్లో రిపోర్ట్ చేసుకోనున్నారు.
ఎస్జీటీలకు నేడు వెబ్ ఆప్షన్లు
ఎస్జీ టీచర్ల బదిలీల్లో భాగంగా సోమవారం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. మ్యానువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని టీచర్లు, సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం వెబ్ కౌన్సెలింగ్కే మొగ్గు చూపింది. ఆసక్తి ఉన్న వారు వ్యక్తిగతంగా వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. మరోవైపు ప్రతి మండల ఎమ్మార్సీల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లోకి వెళ్తే... సిబ్బంది వెబ్ ఆప్షన్లు నమోదు చేస్తారని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు.

నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’