
మట్టి లేదు.. పరీక్షలూ లేవు!
అనంతపురం అగ్రికల్చర్: ఈ సారి మట్టి నమూనాలు సేకరించలేదు. భూసార పరీక్షలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 25,107 భూసార పరీక్షలు చేపట్టాలని కమిషనరేట్ నుంచి లక్ష్యం నిర్దేశించారు. ఈ క్రమంలో మే నెలాఖరు నాటికి 31 మండలాల నుంచి ఆర్ఎస్కేల వారీగా కేటాయింపుల మేరకు మట్టి నమూనాలు సేకరించాలని వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ ఏప్రిల్ 26న ఆదేశాలు ఇచ్చారు. జూన్ నుంచి విరామం లేకుండా మట్టి పరీక్షలు నిర్వహించి సకాలంలో రైతులకు హెల్త్కార్డులు ఇవ్వాలని భూసార పరీక్షా కేంద్రం ఏడీఏ, ఏఓలకు దిశా నిర్దేశం చేశారు. కానీ జూన్ మొదటి వారం ముగిసినా ఇప్పటి వరకు మండలాల నుంచి మట్టి నమూనాలు రాకపోవడం గమనార్హం. కేవలం ఆత్మకూరు మండలం నుంచి కొన్ని శ్యాంపిల్స్ వచ్చినట్లు ప్రయోగశాల అధికారులు తెలిపారు. ప్రయోగశాలలో మట్టి పరీక్షలు ఇంకా మొదలు పెట్టనేలేదు.
12 రకాల పరీక్షలు..
రైతులకు ఎరువుల ఖర్చు తగ్గించి లాభసాటి వ్యవసాయం కోసం మట్టి పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి ఆర్ఎస్కే పరిధిలో తప్పనిసరిగా నిబంధనల మేరకు మట్టి నమూనాలు సేకరించి పంపాలి. ఒక్కో మట్టి నమూనా నుంచి 12 రకాల పరీక్షలు నిర్వహించి పోషకాలు విశ్లేషిస్తారు. పీహెచ్ (భూమి స్థితి) శాతం, ఎలెక్ట్రికల్ కండక్టర్ (ఈసీ), ఆర్గానిక్ కర్బన్ (ఓసీ), నైట్రోజన్ (ఎన్), ఫాస్పరస్ (పీ), పొటాష్ (కే), సల్ఫర్, బోరాన్, ఐరన్, కాపర్, జింక్, మాంగనీస్ లాంటి స్థూలపోషకాలు (మ్యాక్రో న్యూట్రియంట్స్), అలాగే సూక్ష్మపోషకాలు (మైక్రో న్యూట్రియంట్స్) శాతం విశ్లేషిస్తారు. ఆ తర్వాత రైతులు సాగు చేసే పంటలను బట్టి వాడాల్సిన ఎరువులను హెల్త్కార్డు ద్వారా సిఫారసు చేస్తారు. అయితే, కీలకమైన వేసవిలో మట్టి సేకరణ జరగకపోవడంతో ఈ సారి మట్టి పరీక్షలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. ఇప్పటికే వర్షాలు కురవడం, ఖరీఫ్ పంటల సాగుకు సమయం సమీపించడంతో భూసార పరీక్షల ద్వారా పెద్దగా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. మరోవైపు ఇష్టారాజ్యంగా మట్టిని సేకరించి పంపడం, ప్రయోగశాలలో కూడా తూతూ మంత్రంగా పరీక్షలు చేపట్టడం వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదనే విమర్శలూ లేకపోలేదు.
ఈ ఏడాది 25,107
భూసార పరీక్షలు లక్ష్యం
ఇప్పటి వరకు మట్టి నమూనాల
సేకరణ శూన్యం