పట్టపగలే దోపిడీ | - | Sakshi
Sakshi News home page

పట్టపగలే దోపిడీ

Jun 8 2025 12:48 AM | Updated on Jun 8 2025 12:48 AM

పట్టప

పట్టపగలే దోపిడీ

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజు నుంచి ‘తెలుగు తమ్ముళ్లు’ సహజ వనరులను కొల్లగొడుతున్నారు. అధికారమే అనుమతులుగా భావించి ప్రభుత్వానికి పైసా పన్ను చెల్లించకుండా దోచుకుంటున్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబం పేరు చెప్పుకుంటూ

దందా సాగిస్తున్నారు. రెవెన్యూ, పోలీస్‌, భూగర్భ గనులశాఖ అధికారులు ఆవైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలున్నాయి. కిందిస్థాయి ఉద్యోగులకు మామూళ్లు ముట్ట చెబుతున్నట్లు తెలిసింది.

రాప్తాడురూరల్‌: అనంతపురం రూరల్‌ మండలం కృష్ణమరెడ్డిపల్లి సమీపంలోని పెద్దకొండ, ఆలమూరు జగనన్న కాలనీ పక్కన ఉన్న ఎర్ర కొండ, నరసనాయనికుంట గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి ధ్వజస్తంభం గుట్ట (తాటిచెర్ల పొలం)ల్లో టీడీపీ నాయకుల ఎర్ర మట్టి అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇప్పటికే కొండ గుట్టలను నామరూపాల్లేకుండా చేసి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారు. తాజాగా పూల కుంట సమీపంలోని దుర్గం గ్రామానికి వెళ్లేదారిలో ఉన్న గుట్టను కొల్లగొడుతున్నారు. పూలకుంట ఊరి చరిత్రలో ఈ గుట్ట నుంచి ఇప్పటిదాకా కనీసం ఒక్కరాయిని కూడా ఎవరూ తరలించలేదు. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే ఎకరాల విస్తీర్ణంలో పెద్దపెద్ద గుంతలు తవ్వి వందలాది టిప్పర్ల మట్టిని తరలించారు.

‘పెద్దకొండ’ను కొల్లగొట్టారు..

ఇప్పటికే కృష్ణంరెడ్డిపల్లి సమీపంలోని చియ్యేడు పొలం 231 సర్వే నంబరులోని ‘పెద్దకొండ’ను కొల్లగొట్టారు. ఇక్కడి నుంచి రోజూ 80–90 ట్రిప్పుల దాకా మట్టిని తరలించి సొమ్ము చేసుకున్నారు. ఇందులో కృష్ణమరెడ్డిపల్లికి చెందిన తిరుపాలు, అనంతయ్య కీలకంగా వ్యవహరించినట్లు ఆ ప్రాంతమంతా కోడై కూస్తోంది. ఈ కొండతో పాటు చియ్యేడు పాఠశాల వద్ద, దర్గాకు వెళ్లేదారిలోనూ పెద్దపెద్ద గుంతలు పెట్టారు. చూస్తేనే భయపడేలా ఈ గుంతలు కనిపిస్తాయి. పత్రికల్లో వరుస కథనాలు రావడంతో ఇక్కడ తాత్కాలికంగా మట్టి తవ్వకాలకు బ్రేక్‌ వేశారు.

తాజాగా పూలకుంట గుట్టపై కన్ను..

మట్టి తినడంతో ఆరితేరిన ‘తెలుగు తమ్ముళ్లు’ ఇటీవల పూలకుంట గుట్టపై కన్నేశారు. ఇక్కడి నుంచి రోజూ పట్టపగలే మట్టిని తరలిస్తున్నారు. నిత్యం లక్ష రూపాయల వరకు జేబుల్లోకి వేసుకుంటున్నట్లు తెలిసింది. కృష్ణమరెడ్డిపల్లికి చెందిన తిరుపాలు ఇందులో సూత్రధారి అనే ఆరోపణలున్నాయి. ఆయనతో పాటు వడ్డే రమేష్‌ అనే వ్యక్తి, పూలకుంట గ్రామానికి చెందిన వేమారెడ్డి జేసీబీలు పెట్టినట్లు తెలిసింది. పూలకుంట గ్రామంలో 12 అడుగుల రోడ్లున్నాయి. మట్టి టిప్పర్ల తాకిడితో ఎదురుగా ద్విచక్ర వాహనాలు వచ్చినా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. భారీ లోడుతో వెళ్లే టిప్పర్లతో గ్రామస్తులు రోజూ ట్రాఫిక్‌ సమస్య ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే పరిటాల కుటుంబం పేరు చెబుతుండడంతో ప్రశ్నించడానికి స్థానికులు భయపడుతున్నారు. కాగా ఈ ప్రాంతంలో వీఆర్‌ఏ పాత్రపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమదందా వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లి.. వీఆర్‌ఏను అప్రమత్తం చేసిన ప్రతిసారీ ఆయనే ముందుగా అక్రమార్కులకు ఉప్పందిస్తు న్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. పూలకుంటలో ఎర్రమట్టి దందాపై వివరణ కోరేందుకు భూగర్భ గనుల శాఖ డీడీ గ్రంధి వెంకటేశ్వర్లును ఫోన్‌లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

పూలకుంట టు అనంతపురం

యథేచ్ఛగా ఎర్రమట్టి అక్రమ రవాణా

రోజూ రూ. లక్షకు పైగా ఆదాయం

ప్రధాన సూత్రధారి కృష్ణమరెడ్డిపల్లి వాసి

ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబం పేరు చెప్పుకుంటూ దందా

మామూళ్ల మత్తులో రెవెన్యూ, పోలీస్‌, భూగర్భ గనులశాఖ అధికారులు

పట్టపగలే దోపిడీ1
1/1

పట్టపగలే దోపిడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement