
‘షైనింగ్ స్టార్స్’కు ఏర్పాట్లు చేయండి
● అధికారులకు కలెక్టర్ ఆదేశం
అనంతపురం అర్బన్: ‘షైనింగ్ స్టార్స్’ కార్యక్రమాన్ని ఈ నెల 9న నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘షైనింగ్ స్టార్స్’ కింద 184 మంది పదో తరగతి, 35 మంది ఇంటర్ విద్యార్థులను ఎంపిక చేశారన్నారు. వీరందరికీ మెడల్, సర్టిఫికెట్, రూ.20 వేల నగదు అందజేయాలన్నారు. కార్యక్రమ నిర్వహణకు వేదిక గుర్తించి ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఈనెల 12కు ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు కొత్తగా అనుమతులు మంజూరు చేసి ప్రారంభోత్సవాలు చేపట్టాలన్నారు.
న్యూరో సర్జరీ విభాగానికి
నాలుగు పీజీ సీట్లు
అనంతపురం కార్పొరేషన్: నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని న్యూరో సర్జరీ విభాగానికి నాలుగు పీజీ సీట్లు మంజూరు చేస్తూ ఎన్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్య రావు హర్షం వ్యక్తం చేశారు. రోగులకు మరింత నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. ఈ సంవత్సరం నుంచే పీజీ సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ నెల నుంచి విద్యార్థులు చేరతారన్నారు. నూతన ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుందన్నారు. రానున్న ఏడాది పీడియాట్రిక్ సర్జరీలోనూ పీజీ సీట్లు వస్తాయని ప్రిన్సిపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో వైద్య కళాశాల ఏ గ్రేడ్ పరిధిలోకి వస్తుందని, ఆ దిశగా అంకితభావంతో పని చేస్తామని తెలిపారు. కాగా, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అప్పటి స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రత్యేక చొరవతో వైద్య కళాశాల బలోపేతమైంది. ఏళ్ల తరబడి ఆచరణకు నోచుకుని సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. న్యూరో, కార్డియోలతో కలుపుకుని 7 స్పెషాలిటీ వైద్య సేవలు ప్రజలకు అందేలా చర్యలు చేపట్టారు. దీంతో పాటు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్య రావు చొరవతో వైద్య కళాశాలకు మహర్దశ పట్టింది. ఇప్పటి వరకు 120కి పైగా పీజీ సీట్లు వచ్చాయి.
ఇంటర్ సప్లిమెంటరీ
ఫలితాల విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మొదటి సంవత్సరంలో అనంతపురం జిల్లా రాష్ట్రంలో 14వ స్థానంలో నిలవగా, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 7వ స్థానం దక్కించుకుంది. మొదటి సంవత్సరం ఫలితాల్లో 7,404 మంది విద్యార్థులకు గాను 3,336 మంది (45 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 4,545 మంది విద్యార్థులకు గాను 3,128 మంది (69 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ ఫలితాలకు సంబంధించి మొదటి సంవత్సరంలో 925 మంది విద్యార్థులకు గాను 375 మంది (41 శాతం) ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 21వ స్థానంలో నిలవగా, ద్వితీయ సంవత్సరంలో 428 మందికి గాను 275 మంది 64 శాతం ఉత్తీర్ణతతో 14వ స్థానంలో నిలిచింది.

‘షైనింగ్ స్టార్స్’కు ఏర్పాట్లు చేయండి