పర్యావరణ దినోత్సవ ఏర్పాట్లు బాగుండాలి | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ దినోత్సవ ఏర్పాట్లు బాగుండాలి

Jun 5 2025 8:00 AM | Updated on Jun 5 2025 8:08 AM

అనంతపురం అర్బన్‌: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించాలని సంబంధిత అధికాలను కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ ఆదేశించారు. లోటుపాట్లకు తావివ్వకుండా నిర్వహణ ఏర్పాట్లు బాగుండాలన్నారు. పర్యావరణ దినోత్సవం ఏర్పాట్లపై కలెక్టర్‌ బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో అధికారులతో ఆయన సమీక్షించారు. ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని నివారిద్ధామనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించనున్నామన్నారు. ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలోని నగర వనంలో జిల్లా స్థాయి కార్యక్రమం ఉంటుందన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. గురువారం తరువాత ప్రతి రోజు ఒక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే మొక్కలు నాటే కార్యక్రమంలో తాను పాల్గొంటానన్నారు. నగర, పట్టణ ప్రాంతాల్లో అవెన్యూ ప్లాంటేషన్‌ చేపట్టాలన్నారు. అనంతరం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2025 పోస్టర్లను కలెక్టర్‌, అధికారులు ఆవిష్కరించారు. సమీక్షలో అటవీశాఖ ప్లయింగ్‌ స్క్వాడ్‌ గురుప్రభాకర్‌, డ్వామా పీడీ సలీంబాషా, డీపీఈఓ నాగరాజు నాయుడు, జెడ్పీ సీఈఓ రామసుబ్బయ్య, నగర పాలక కమిషనర్‌ బాలస్వామి, కాలుష్య నియంత్రణ మండలి బోర్డు ఈఈ మునిప్రసాద్‌, డీసీఓ ఆరుణకుమార్‌, ఉద్యాన శాఖ డీడీ నరసింహారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

48 పట్టాదారు

పాసు బుక్కుల రద్దు

గుత్తి: మండలంలోని ఊటకల్లు రెవెన్యూ పరిధిలో గుర్తించిన 48 దొంగ పట్టాదారు పాస్‌ బుక్కులను సంబంధిత అధికారులు రద్దు చేశారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇటీవల ఆర్డీఓ శ్రీనివాస్‌ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో తహసీల్దార్‌ ఓబులేసు, రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్‌ లత, వీఆర్వోలు వారం పాటు విచారణ చేశారు. మొత్తం 48 మంది దొంగ పట్టాదారు పాస్‌ బుక్కులు కలిగినట్లుగా గుర్తించారు. వీరిలో కొందరు ప్రభుత్వ భూములకు పాస్‌ బుక్కులు చేయించుకోగా, మరి కొందరు భూములు లేకున్నా పాస్‌ బుక్కులు పొంది రైతు భరోసా, బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. మండల వ్యాప్తంగా మరో 50 కి పైగా దొంగ పట్టాదారు పాసు బుక్కులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బుధవారం తహసీల్దార్‌ ఓబులేసు, రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్‌ లతను వివరణ కోరగా ఊటకల్లులో 48 దొంగ పట్టాదారు పాసు బుక్కులను రద్దు చేసిన మాట వాస్తవమేనన్నారు. మండల వ్యాప్తంగా విచారణ చేస్తున్నామన్నారు. విచారణలో దొంగ పట్టాదారు పాసు బుక్కులు ఉన్నట్లు తేలితే రద్దు చేస్తామన్నారు. దొంగ పట్టాదారు పాసు బుక్కులతో రైతు భరోసా, బ్యాంకుల్లో పంట రుణాలు పొందిన వారిపై తదుపరి చర్యలు ఆర్డీఓ తీసుకుంటారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement