ఎస్పీ గారూ.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? | - | Sakshi
Sakshi News home page

ఎస్పీ గారూ.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం?

Jun 5 2025 8:08 AM | Updated on Jun 5 2025 8:08 AM

ఎస్పీ

ఎస్పీ గారూ.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం?

యల్లనూరు: ‘హైకోర్టు ఆర్డర్‌ తెచ్చుకుంటే తాడిపత్రికి పంపుతానని హామీ ఇచ్చారు. న్యాయస్థానం నుంచి ఆ మేరకు ఉత్తర్వులు తెచ్చుకుంటే ఏవేవో కారణాలు చెబుతూ అడ్డుకుంటున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యమో అర్థం కావడం లేదు. జిల్లా ఎస్పీ గారు.. హత్యా రాజకీయాలను ప్రోత్సహించొద్దు. కావాలంటే ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయండి’ అంటూ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు యాడికి మండలంలో ‘వెన్నుపోటు దినం’ ర్యాలీలో పాల్గొనేందుకు కార్యకర్తలతో బయల్దేరిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎస్పీ జగదీష్‌ ఆదేశాల మేరకు తెల్లవారుజామునే డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున పెద్దారెడ్డి స్వగ్రామమైన మండలంలోని తిమ్మంపల్లికి చేరుకున్నారు. ఇంటి నుంచి మాజీ ఎమ్మెల్యే బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ‘మీరు కాకుండా మీ తరఫున ఎవరైనా యాడికి వెళ్లొచ్చు’ అంటూ డీఎస్పీ తెలుపగా పెద్దారెడ్డి తన కుమారుడు హర్షవర్దన్‌రెడ్డిని పంపించారు. ఈ క్రమంలోనే తనను ఎస్పీ వద్దకు తీసుకెళ్లాలని పెద్దారెడ్డి పోలీసులు పట్టుబట్టగా పోలీసులు నిరాకరించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ తీరుపై విమర్శలు గుప్పించారు. తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి మాట వింటూ తనపై ఎస్పీ జగదీష్‌ కక్ష కట్టారని మండిపడ్డారు. కోర్టు ఆర్డర్‌ను సైతం పక్కన పెట్టడం అన్యాయమన్నారు. పోలీసుల వరకు వస్తే చట్టాలు.. మా వరకు వస్తే సాకులు చెబుతారా అని ప్రశ్నించారు. ఎస్పీకి ఆరు సార్లు మెయిల్‌ పెట్టినా పట్టించుకోలేదన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తాము ఎప్పుడూ ఇలా వ్యవహరించలేదన్నారు. భవిష్యత్తులో మళ్లీ అధికారంలోకి వస్తామని, అన్నీ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. ఇటీవల తిమ్మనచెరువు గ్రామంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై దాడులు చేస్తే పోలీసులు కేసులు నమోదు చేయలేదన్నారు. ఇదేం ప్రజాస్వామ్యం అని పెద్దారెడ్డి దుయ్యబట్టారు. తాడిపత్రి జేసీ నాగిరెడ్డి జాగీరు కాదని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనరు వెంకటేష్‌నాయుడు, నాయకులు గొడ్డుమర్రి ఈశ్వర్‌రెడ్డి, దంతలపల్లి పెద్దిరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, కల్లూరు సూరి, కొత్తపల్లి పురుషోత్తం నాయుడు, వెంకటాంపల్లి శంకర్‌రెడ్డి, యల్లనూరు కిరణ్‌, చిలమకూరు జనార్థన్‌, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

హత్యా రాజకీయాలను ప్రోత్సహించొద్దు

కావాలంటే రాజీనామా చేసి టీడీపీ తరఫున పోటీ చేయండి

కోర్టు అనుమతి ఇచ్చినా జేసీ మాట విని అడ్డుకుంటారా?

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ధ్వజం

ఎస్పీ గారూ.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? 1
1/1

ఎస్పీ గారూ.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement