నష్టపోయిన రైతులను ఆదుకోండి | - | Sakshi
Sakshi News home page

నష్టపోయిన రైతులను ఆదుకోండి

Jun 7 2025 1:36 AM | Updated on Jun 7 2025 1:36 AM

నష్టపోయిన రైతులను ఆదుకోండి

నష్టపోయిన రైతులను ఆదుకోండి

అనంతపురం సిటీ: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అరటి, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని, బాధిత రైతులను నష్ట పరిహారం అందించి అన్ని విధాల ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జెడ్పీటీసీ సభ్యులు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై ఉద్యాన శాఖ అధికారి నరసింహారావు స్పందిస్తూ.. పూత, పిందే దశలో ఉన్న వాటికి పరిహారం వర్తించదని, చెట్లు పూర్తిగా నేలమట్టమైతేనే పరిహారం చెల్లిస్తామని చెప్పడంతో సభ్యులు ఒక్కసారిగా అగ్రహం వ్యక్తం చేశారు. ఉభయ జిల్లా స్థాయీ సంఘం–1, 2, 3, 4, 5, 6, 7 సమావేశాలు జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ అధ్యక్షతన జిల్లా పరిషత్‌ కార్యాలయ సమావేశ భవన్‌లో శుక్రవారం జరిగింది. సీఈఓ వెంకటసుబ్బయ్య, జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ నాగరత్నమ్మ, గుమ్మఘట్ట జెడ్పీటీసీ సభ్యుడు మహేష్‌, ఉరవకొండ జెడ్పీటీసీ సభ్యురాలు పార్వతమ్మ వేదికపై ఆశీనులయ్యారు. తొలుత వ్యవసాయ శాఖపై చర్చ సందర్భంగా మామిడి, అరటి రైతులను ఆదుకోవాలనే అంశంపై గోరంట్ల, ఓబుళదేవరచెరువు జెడ్పీటీసీ సభ్యులు పాలే జయరాం నాయక్‌, దామోదర్‌రెడ్డి మాట్లాడారు. భారీ వర్షాలతో నష్టపోయిన ఉద్యాన రైతులను ఏ విధంగా ఆదుకుంటారో తెలపాలని పట్టుబట్టారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ జోక్యం చేసుకుంటూ ఎన్ని హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి, ఎన్ని చెట్లు కూలిపోయాయ్‌, ఎంత మంది రైతులు నష్టపోయారో వివరాలు వెల్లడించాలని సూచించారు. అయితే ఉద్యాన శాఖ అధికారి వద్ద కనీస సమాచారం లేకపోగా, పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో సభ్యులు మండిపడ్డారు. చెట్లు కూలిపోతేనే పరిహారం ఇస్తామని చెప్పడంతో .. అంతెందుకు రైతులు చస్తేనే పరిహారం ఇస్తామని ప్రకటించండంటూ ఆవేశంతో ఊగిపోయారు. రైతులకు నాణ్యమైన కందులు సరఫరా చేయాలని గుమ్మఘట్ట జెడ్పీటీసీ మహేష్‌, ఓడీచెరువు జెడ్పీటీసీ దామోదర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఏయే పంటలు సాగు చేయాలో రైతులకు అవగాహన కల్పించాలని నల్లమాడ జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి కోరారు. రైతు భరోసా కేంద్రాలను ఎందుకు నిర్వీర్యం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పోషణ్‌ పక్వాడా నిధుల స్వాహాపై

చర్యలేవీ?

పోషణ్‌ పక్వాడా నిర్వహణకు సంబంధించి ఒక్కో జిల్లాకు రూ.5 లక్షలు చొప్పున ఉమ్మడి జిల్లాకు రూ.10 లక్షలు మంజూరయ్యాయని, వీటిని సీడీపీఓలు నొక్కేసి తూతూ మంత్రంగా ముగించారని నార్పల జెడ్పీటీసీ నాగరత్నమ్మ, గోరంట్ల జెడ్పీటీసీ జయరాం నాయక్‌ ఆరోపించారు. ఆ భారమంతా సూపర్‌వైజర్ల మీద పడిందన్నారు. సీడీపీఓలపై చర్యలు తీసుకొని ప్రభుత్వం ఇచ్చిన డబ్బును సూపర్‌వైజర్లకు పంచాలని డిమాండ్‌ చేశారు. ఐసీడీఎస్‌ పీడీ నాగమణి స్పందిస్తూ.. వచ్చిన డబ్బును సీడీపీఓల ఖాతాల్లో జమ చేశామని ఆధారాలు చూపారు. అయితే వాళ్లు దిగమింగిన సంగతి తనకు తెలియదని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

పేద విద్యార్థులకు న్యాయం చేయండి

జిల్లాలోని అంబేడ్కర్‌, ఇతర గురుకుల పాఠశాలల్లో గతంలో సీట్లు అమ్ముకున్నారని, ఈసారి ఆ పరిస్థితి లేకుండా పేద విద్యార్థులకు న్యాయం చేకూరేలా చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీ నాగరత్నమ్మ కోరారు. హాస్టళ్లలో పరిస్థితులు మెరుగుపడేలా చూడాలన్నారు. సీట్లు కావాలని ఓట్లేసిన ప్రజలు ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తుంటారని, అలాంటప్పుడు వారు సిఫారసు చేస్తే కచ్చితంగా కొన్ని సీట్లు ఇచ్చేలా చూడాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ సూచించారు.

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకోండి

స్థాయీ సంఘ సమావేశానికి డుమ్మా కొట్టిన ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు చర్యలు తీసుకోవాలంటూ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఓబుళదేవరచెరువు పీహెచ్‌సీ కూలిపోయేందుకు సిద్ధంగా ఉందని, అయినా అదే పాడుబడిన భవనంలో వైద్య సేవలు అందిస్తుండడంపై జెడ్పీటీసీ దాము ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై జెడ్పీ చైర్‌పర్సన్‌ కల్పించుకుంటూ.. పరిస్థితిని ప్రభుత్వానికి వివరించి, కొత్త భవనాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని శ్రీసత్యసాయి జిల్లా డీఎంహెచ్‌ఓను ఆదేశించారు.

జెడ్పీ స్థాయీ సంఘ సమావేశంలో సభ్యుల డిమాండ్‌

అరటి, మామిడి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని సూచన

చెట్లు కూలిపోతేనే పరిహారం చెల్లిస్తామని అధికారి వివరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement