
కామాంధులను కఠినంగా శిక్షించాలి
● ఎంఈఎఫ్ జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి బండారు శంకర్
అనంతపురం టవర్క్లాక్: దళిత బాలికను గర్భవతిని చేసిన కామాంధులను కఠినంగా శిక్షించాలని ఎంఈఎఫ్ జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి బండారు శంకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఉపాధ్యాయ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామగిరి మండలానికి చెందిన దళిత మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు 6 నెలల పాటు బెదిరించి అత్యాచారం చేస్తూ వచ్చారన్నారు. ఫలితంగా ఆ చిన్నారి గర్భవతి అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావుతం కాకుండా ఉండేందుకు విద్యార్థినిపై సాముహిక అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలన్నారు.
యోగాంధ్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
అనంతపురం రూరల్: యోగాంధ్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సంబంధిత అదికారులను కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. ఈ నెల 8 న శిల్పారామంలో జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం జరుగుతున్న నేపద్యంలో అక్కడ చేపట్టిన ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. శిల్పారామం పరిసరాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కేశవనాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి పాల్గొన్నారు.
బక్రీద్ సందర్భంగా
పటిష్ట భద్రత
అనంతపురం: బక్రీద్ సందర్భంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఎస్పీ పి.జగదీష్ ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న మసీదులు, మదరసాలు, ఈద్గాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. సున్నిత ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. బీట్లు, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలన్నారు. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ సహా ఏదైనా సోషల్ మీడియాల్లో అభ్యంతకరమైన పోస్ట్లు షేర్ చేస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ను సులభతరం చేయాలన్నారు. త్యాగానికి, సహనానికి ప్రతీకగా నిలిచిన బక్రీద్ పండుగను శాంతి సామరస్యాలు వెల్లివిరిసేలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ జిల్లాలోని ముస్లింలకు ఎస్పీ పి. జగదీష్ శుభాకాంక్షలు తెలిపారు.