
విత్తన నాణ్యతతోనే అధిక దిగుబడులు
● భారత నూనె గింజల పరిశోధనా స్థానం డైరెక్టర్ మాథూర్
కూడేరు: పంటల సాగులో విత్తనం నాణ్యతగా ఉంటేనే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశముంటుందని భారత నూనె గింజల పరిశోధనా స్థానం (ఐఐఓఆర్) డైరెక్టర్ డాక్టర్ ఆర్కే మాథూర్ అన్నారు. ‘వికసిత్ కృషి సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్లోని భారతీయ నూనె గింజల ప్రాంతీయ పరిశోధన స్థానం, రేకులకుంట, కదిరి, కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం, మండల వ్యవసాయ శాఖ సంయుక్తంగా కూడేరు మండలం పి.నారాయణపురం గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. శాస్త్రవేత్తలు డాక్టర్ మంజునాథ్, డాక్టర్ సతీష్, డాక్టర్ విజయ శంకర్, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ చెన్నరాయుడు మాట్లాడుతూ.. యాజమాన్య పద్దతుల్లో ఆముదం పంట సాగు చేస్తే లాభాలు ఉంటాయన్నారు. అనంతరం కలగళ్ల, ఇప్పేరు, పి.నారాయణపురం రైతులకు 4 కిలోల చొప్పున ఐసీహెచ్–5 రకం ఆముద విత్తనాలను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ హనుమంతరెడ్డి, ఏఓ విజయకుమార్, రైతు సేవా కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.
రైలు ఎక్కబోతూ కిందపడి వృద్ధుడి మృతి
అనంతపురం సిటీ: స్థానిక రైల్వే స్టేషన్లో కదిలుతున్న రైలు ఎక్కబోయి కింద పడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. జీఆర్పీ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన దూదేకుల సంజీవరాయుడు(60)కు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. యర్రగుంట్లలోని చిన్న కొడుకు వద్ద ఉంటున్న రాయుడు హోటల్లో పని చేసుకుంటూ కాలం వెళ్లదీసేవాడు. గురువారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి చేరుకోవడంతో కుమారుడు మందలించాడు. మనస్తాపానికి గురైన రాయుడు రాత్రికి ఇంటి నుంచి వచ్చేసి యర్రగుంట్ల రైల్వే స్టేషన్లోనే పడుకున్నాడు. శుక్రవారం ఉదయమే మచిలీపట్నం–ధర్మవరం రైలెక్కి అనంతపురానికి చేరుకుని నీళ్ల కోసమని దిగాడు. అదే సమయంలో రైలు కదులుతుండడం చూసి ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే అదుపుతప్పి పడిపోవడంతో తీవ్రంగా గాయపడిన ఆయనను 108 వాహనంలో సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ కోలుకోలేక మరణించాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

విత్తన నాణ్యతతోనే అధిక దిగుబడులు