
చింతకుంట మధుపై దాడి
అనంతపురం: వైఎస్సార్సీపీ నేత చింతకుంట మధుపై టీడీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేశారు. బాధితుడు తెలిపిన మేరకు... నగరంలోని 39వ డివిజన్ పరిధిలో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మేయర్ వసీంతో పాటు కార్పొరేటర్లు, పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. మేయర్ మొక్కలు నాటి వెళ్లిన అనంతరం కార్పొరేటర్ చింతకుంట సుశీలమ్మ కుమారుడు, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు వద్దకు స్థానిక టీడీపీ నేతలు మోహన్ కుమార్, అఖిల్, ఏఆర్ కానిస్టేబుల్ నరేంద్రతో పాటు మరో పది మంది వచ్చి వాదనకు దిగారు. ఆగ్రహంతో ఊగిపోతూ మధును చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడిచేశారు. అక్కడే ఉన్న సచివాలయ ఉద్యోగులను సైతం దూషించారు. కూటమి ప్రభుత్వంలో నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ వారు ఎలా పాల్గొంటారు.. వారిని ఎలా మీరు రానిస్తారు అంటూ రెచ్చిపోయారు.
దాడి హేయం
చింతకుంట మధుపై టీడీపీ నేతలు దాడి చేయడం హేయమని మేయర్ వసీం ఖండించారు. దాడి విషయం తెలుసుకున్న మేయర్తో పాటు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి, బాధితుడు చింతకుంట మధుతో కలిసి నాలుగో పట్టణ పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. సీఐకి ఫోన్ చేస్తే తాను సెలవులో ఉన్నానని చెప్పారు. ఎస్ఐ వద్దకు వెళ్తే ఆయన ఆ సమయంలో భోజనం చేస్తున్నారు. దాదాపు గంట సేపటి తర్వాత బాధితుడి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. అనంతరం మేయర్ విలేకరులతో మాట్లాడారు. ఫిర్యాదు తీసుకోవడానికి ఇబ్బంది పడేటప్పుడు.. ఉద్యోగం ఎందుకు చేయాలని ప్రశ్నించారు. గత ఐదేళ్ల పాలనలో అప్పటి అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఏనాడూ కబ్జాలు, దౌర్జన్యాలను ప్రోత్సహించలేదన్నారు. నేడు కూటమి పాలనలో నగరంలో అరాచకాలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా పత్రికల్లో వస్తున్న వార్తలే ఇందుకు నిదర్శనమన్నారు. ఇటీవల తన చాంబర్లోకి సైతం టీడీపీ నేతలు దౌర్జన్యంగా ప్రవేశిస్తే ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. నాడు ఎస్పీ కఠినంగా వ్యవహరించి ఉంటే నేడు ఇలాంటి ఘటనలు జరిగి ఉండేవి కాదన్నారు. చింతకుంట మధుపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్ర, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ ఆలమూరు శ్రీనివాసరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులేసు, యువజన విభాగం స్పోక్స్పర్సన్ మారుతీ నాయుడు, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు దాదా ఖలందర్, ఎస్సీ సెల్ జిల్లా జనరల్ సెక్రెటరీ కుళ్లాయి స్వామి, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాకే శ్రీనివాసులు, టౌన్ సెక్రెటరీ సురేంద్ర రెడ్డి, కార్పొరేటర్స్ సంపంగి రామాంజినేయులు, కమల్, మైనార్టీ నాయకులు రఫీ, వైసీపీ నాయకులు అనిల్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు