
రోగులతో ఆత్మీయంగా మాట్లాడాలి
అనంతపురం అర్బన్: రోగులతో ఆత్మీయంగా మాట్లాడితే.. అదే వారి వ్యాధిని సగం తగ్గించేస్తుందని కలెక్టర్ వినోద్కుమార్ వైద్యులకు సూచించారు. దేవునిగా భావించే వైద్యుల మాటకు అంత శక్తి ఉంటుందని పేర్కొన్నారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో పీహెచ్సీ, యూపీహెచ్సీ, ఎన్టీఆర్ వైద్యసేవ ఆస్పత్రుల వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు, సిబ్బంది ప్రొఫెషనల్గా ఉండాలన్నారు. రోగులను స్నేహభావంతో పలకరించాలని చెప్పారు. ఆస్పత్రి సిబ్బందికి ఈ విషయాన్ని చెప్పాలన్నారు. ఫార్మసిస్టులు ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందించే వైద్యసేవల మీద ఆర్టీజీఎస్ ద్వారా ప్రజల నుంచి ప్రభుత్వం ఫీడ్బ్యాక్ తీసుకుంటోందన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని తనిఖీ చేస్తాన్నారు. వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ రోగులతో వ్యవహరించే తీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ ఈబీ దేవి, ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో–ఆర్డినేటర్ కిరణ్కుమార్రెడ్డి, వైద్యులు పాల్గొన్నారు.