మా వాడే.. దగ్గరకు వేయండి | - | Sakshi
Sakshi News home page

మా వాడే.. దగ్గరకు వేయండి

Jun 4 2025 12:35 AM | Updated on Jun 4 2025 12:35 AM

మా వాడే.. దగ్గరకు వేయండి

మా వాడే.. దగ్గరకు వేయండి

అనంతపురం సిటీ: ‘అతను మా వాడే.. జిల్లా కేంద్రానికి సమీపంలోని ఏదో ఒక మండలానికి ఏఓగా వేయండి’ అంటూ జిల్లా ప్రజా పరిషత్‌ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ వద్ద పని చేసే ఓ అధికారి ఫోన్‌ చేయడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. మొన్నటి వరకు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో పని చేసి ఎనిమిది నెలల క్రితం కళ్యాణదుర్గం నియోజకవర్గానికి బదిలీపై వెళ్లిన పరిపాలనాధికారి(ఏఓ) ఒకరు ఎలాగైనా జెడ్పీ లేదా చుట్టుపక్కల మండలాలకు చేరుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. మొన్నటి వరకూ జెడ్పీ అధికారులు, పాలకవర్గ పెద్దల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో కులం కార్డు బయటకు తీసి నేనూ మీ సామాజిక వర్గం వాడినేనంటూ డిప్యూటీ సీఎం పేషీలోని ఓ అధికారిని ఆశ్రయించి అతని ద్వారా జెడ్పీ అధికారులపై ఒత్తిడి పెంచారు.

విజిలెన్స్‌ విచారణ కొనసాగుతుండగానే..

సదరు ఏఓ జెడ్పీలో పని చేసిన సమయంలో అప్పటి ముఖ్య అధికారుల అండ చూసుకొని బరితెగించి ప్రవర్తించాడు. పాలకవర్గం అనుమతి లేకుండానే ఏకంగా రూ.3 కోట్ల వరకు కాంట్రాక్టర్లకు చెల్లించడం అప్పట్లో దుమారం రేపింది. అందుకు ప్రతిఫలంగా భారీగానే ముడుపులు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జెడ్పీలోని ముఖ్య అధికారులు, సహచార ఉద్యోగుల పేర్లు కూడా వాడుకొని కాంట్రాక్టర్లతో డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం.

ఈ అంశంపై ప్రభుత్వానికి, లోకాయుక్తకు, విజిలెన్స్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో సమగ్ర విచారణకు విజిలెన్స్‌ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. ఇంకా విచారణ కొనసాగుతుండగానే తాను అనుకుంటే పాలకవర్గం, జెడ్పీ ముఖ్య అధికారులు కూడా ఏమీ చేసుకోలేరని, కోరుకున్న చోటుకు పోస్టింగ్‌ తెచ్చుకోకపోతే తన పేరు మార్చుకుంటానంటూ సవాళ్లు విసురుతుండడం జెడ్పీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మండల ఏఓ బదిలీ విషయంగా జెడ్పీ అధికారులకు డిప్యూటీ సీఎం పేషీ నుంచి ఫోన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement