
అర్జీలకు త్వరితగతిన పరిష్కారం చూపాలి
● కలెక్టర్ వినోద్కుమార్
గుత్తి: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే అర్జీలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. గుత్తి ఆర్ఎస్ రోడ్డులో ఉన్న వసుధా ఫంక్షన్ హాలులో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించారు. జేసీ శివ్ నారాయణ శర్మ, డీఆర్ఓ మలోల, ఆర్డీఓ శ్రీనివాస్, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో ఉన్నతాధికారులకు అందజేశారు. మొత్తం 490 అర్జీలు అందాయి. తనకు బదిలీల్లో తీవ్ర అన్యాయం జరిగిందని అనంతపురం గిరిజన బాలుర కళాశాల హాస్టల్లో వార్డెన్గా నిధులు నిర్వహిస్తున్న అనసూయ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అవినీతికి పాల్పడి అంధురాలైన తనను తాను కోరిన గుత్తి ఎస్టీ హాస్టల్కు బదిలీ చేయలేదని విన్నవించారు. డబ్బు ముట్ట జెప్పిన వారిని కోరిన ప్రాంతానికి బదిలీ చేశారని ఆరోపించారు. న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా తదితరులున్నారు.
టీబీ డ్యాంకు 20,025 క్యూసెక్కుల ఇన్ఫ్లో
బొమ్మనహాళ్: కర్ణాటకలోని హొస్పేట్ వద్ద నిర్మించిన తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో పెరిగింది. సోమవారం నాటికి 20,025 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. డ్యాం ఎగువ భాగంలోని శివమొగ్గ, ఆగుంబే, తీర్థనహాళ్లి, వరనాడు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో డ్యాంకు ఇన్ఫ్లో మొదలైంది. మే మొదటి వారంలో జీరోగా ఉన్న ఇన్ఫ్లో.. నేడు 20,025 క్యూసెక్కులుగా నమోదవుతుండటం గమనార్హం. అవుట్ ఫ్లో 236 క్యూసెక్కులుగా ఉంది. ప్రసుత్తం జలాశయంలో 1,633 అడుగులకు గాను 1,597.84 అడుగులకు నీరు చేరింది. మొత్తం నీటి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా 18.860 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి 1,577.47 అడుగుల వద్ద 3.360 టీఎంసీల నీటి నిల్వతో 411 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండింది.
బెంగ తీర్చేనా..?!
అనంతపురం సెంట్రల్: జిల్లాకు వర ప్రదాయినిగా పేరుగాంచిన తుంగభద్ర జలాశయం ఈ ఏడాది ముందుగానే జలకళ సంతరించుకుంటుండడంపై రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సారి త్వరగానే ఆయకట్టుకు సాగునీరు విడుదలవుతాయనే ఆశలు చిగురిస్తున్నాయి. సాధారణంగా జూన్ నెలాఖరు, జూలైలో డ్యాంకు ఇన్ఫ్లో ప్రారంభమవుతుంది. అయితే, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా పలకరించడంతో కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వారం రోజుల వ్యవధిలోనే 20 వేల క్యూసెక్కులకు ఇన్ఫ్లో చేరుకోవడం గమనార్హం. కర్ణాటకలో వర్షాలు కొనసాగితే కొన్ని రోజుల్లోనే గరిష్ట మట్టానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీబీ డ్యాం పరిధిలో హెచ్చెల్సీ కింద జిల్లాకు చాలా లబ్ధి కలుగుతోంది. దాదాపు లక్ష ఎకరాల పైగా సాగునీరు అందుతోంది. ఇలాంటి తరుణంలో డ్యాం త్వరగా నిండితే సాగు,తాగునీటికి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంపై హెచ్చెల్సీ ఎస్ఈ పురార్థనరెడ్డి మాట్లాడుతూ టీబీ డ్యాంకు జూన్లోనే ఇన్ఫ్లో వస్తుండటం శుభ పరిణామమన్నారు. కేటాయింపులు త్వరగా నిర్ణయించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పాము కాటుతో రైతు మృతి
రాయదుర్గం టౌన్: మండలంలోని కెంచానపల్లికి చెందిన రైతు బోయ రామాంజనేయులు (70) పాము కాటుతో మృతి చెందాడు. తన వేరుశనగ పొలంలో సోమవారం మధ్యాహ్నం పనుల్లో నిమగ్నమైన సమయంలో పాము కాటు వేసింది. విషయం తెలుసుకున్న స్థానికులు రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. రామాంజనేయులుకు భార్య శివమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.

అర్జీలకు త్వరితగతిన పరిష్కారం చూపాలి

అర్జీలకు త్వరితగతిన పరిష్కారం చూపాలి