ప్రజా శ్రేయస్సే వైఎస్సార్‌ సీపీ ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

ప్రజా శ్రేయస్సే వైఎస్సార్‌ సీపీ ధ్యేయం

Jun 2 2025 1:55 AM | Updated on Jun 2 2025 1:55 AM

ప్రజా శ్రేయస్సే వైఎస్సార్‌ సీపీ ధ్యేయం

ప్రజా శ్రేయస్సే వైఎస్సార్‌ సీపీ ధ్యేయం

అనంతపురం కార్పొరేషన్‌: ‘ప్రజల శ్రేయస్సే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ధ్యేయం. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పాటుపడ్డారు. ఇప్పుడు ప్రజలను నయవంచనకు గురి చేసిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు పోరాటాలకు సిద్ధమయ్యారు. సీఎం చంద్రబాబుకు కనువిప్పు కల్గించేందుకు వెన్నుపోటు దినం నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు’ అని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని ఏ–7 కన్వెన్షన్‌లో వైఎస్సార్‌ సీపీ అనంతపురం పార్లమెంట్‌ పరిశీలకులు నరేష్‌కుమార్‌ రెడ్డితో కలసి ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, నగర కమిటీలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ‘అనంత’ మాట్లాడుతూ ఈ నెల 4న ఉదయం 10 గంటలకు పాతూరు చెన్నకేశవ స్వామి దేవాలయం నుంచి నిరసన ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. గాంధీ విగ్రహం, వన్‌టౌన్‌ పీఎస్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకు సాగుతుందన్నారు. ర్యాలీలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు, తొలి సంతకాలకు వన్నె తెచ్చిన నాయకులు దివంగత నేత వైఎస్సార్‌, ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ అని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రస్థానమంతా వెన్నుపోటేనని విమర్శించారు. గత ఎన్నికలకు ముందు ‘సూపర్‌ సిక్స్‌’తో పాటు 175 హామీలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకూ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో 1.30 లక్షల మందికి సచివాలయ ఉద్యోగాలు, 2.50 లక్షలకుపైగా వలంటీర్లకు అవకాశం కల్పించారన్నారు. జగన్‌ హయాంలో అభివృద్ధి పనులతో అనంతపురం నగర రూపురేఖలు మార్చేశామన్నారు.

ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే మద్యం మాఫియా

గతంలో మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు సంపద సృష్టించుకునేందుకు మద్యం మాఫియాకు తెరలేపారని ‘అనంత’ ధ్వజమెత్తారు. మద్యం బాటిల్‌పై అదనంగా ధర వసూలు చేస్తున్నారన్నారు. ప్రతినెలా మద్యం షాపుల నుంచి భారీగా ఎమ్మెల్యేలకు ముడుపులు అందుతున్నాయన్నారు. రెవెన్యూ, పోలీసు శాఖలను హస్తగతం చేసుకుని అక్రమ కేసులు, దౌర్జన్యాలు, హత్యలు చేస్తూ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారన్నారు.

వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌..

వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు అని వైఎస్సార్‌ సీపీ అనంతపురం పార్లమెంట్‌ పరిశీలకులు నరేష్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు మోసాలపై గళమెత్తుదామని, ఈ నెల 4న జరిగే వెన్నుపోటు దినం నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. చైతన్యానికి మారుపేరు అనంతపురం అని, వైఎస్సార్‌ సీపీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌ రెడ్డి, పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్‌, పార్టీ జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ సభ్యులు రమేష్‌గౌడ్‌, టీటీడీ మాజీ బోర్డు సభ్యులు అశ్వర్థ్‌ నాయక్‌, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్‌మోహన్‌ రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్‌ఘర్‌ రిజ్వాన్‌ తదితరులు ప్రసంగించారు. ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్‌ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్‌ రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు సాకే చంద్రశేఖర్‌, ఓబిరెడ్డి, శ్రీదేవి, మల్లెమీద నరసింహులు, చంద్రశేఖర్‌ యాదవ్‌, అమర్‌నాథ్‌ రెడ్డి, సైఫుల్లాబేగ్‌, శ్రీదేవి, చింతా సోమశేఖర్‌ రెడ్డి, నాయకులు కృష్ణవేణి, దత్తా, వెన్నం శివరామిరెడ్డి, కేశవరెడ్డి, బాకే హబీబుల్లా, పెన్నోబులేసు, చింతకుంట మధు, ఆసిఫ్‌, సాకే చంద్రలేఖ, సుజాత రెడ్డి, పార్వతి, భారతి, గౌని నాగన్న, జానీ, రామయ్య, తదితరులు పాల్గొన్నారు.

వెన్నుపోటు దినాన్ని జయప్రదం చేద్దాం

పార్టీ జిల్లా అధ్యక్షుడు

అనంత వెంకటరామిరెడ్డి పిలుపు

వెన్నపోటుకు బాబు బ్రాండ్‌ అంబాసిడర్‌: పార్టీ పార్లమెంట్‌ పరిశీలకులు

నరేష్‌కుమార్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement