గంటల తరబడి వేచి ఉన్నా.. | - | Sakshi
Sakshi News home page

గంటల తరబడి వేచి ఉన్నా..

Jun 2 2025 1:55 AM | Updated on Jun 2 2025 9:46 AM

-

ఈమె పేరు జయమ్మ. అనంతపురంలోని నవోదయ కాలనీవాసి. తన ఇంటి నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న స్టోర్‌ నం. 88లో ఆదివారం రేషన్‌ తీసుకునేందుకు వచ్చి లైన్‌లో నిలబడలేక చెట్టు కిందకు వెళ్లి కూర్చుంది. ఉదయం 8.30 గంటలకు నీళ్లు వస్తే పట్టేసి వచ్చానని, ఇక్కడేమో 9 గంటలైనా రేషన్‌ ఇవ్వడం మొదలు పెట్టలేదని వాపోయింది. రెండు రోజులే ఇచ్చి ఆ తరువాత బియ్యం అయిపోయాయని చెబుతారనే భయంతో మొహం కూడా కడుక్కోకుండానే మొదటి రోజే వచ్చినట్లు చెప్పింది. గతంలో తమ వీధిలోకే రేషన్‌ బండి వచ్చేదని, కేవలం 10 నిమిషాల్లో బియ్యం, సరుకులు తీసుకునేదాన్నని గుర్తు చేసుకుంది.

రేషన్‌ సరుకులు తీసుకోవాలంటే గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉండే దుస్థితి దాపురించింది. గత ప్రభుత్వం తరహాలో ఇంటి వద్దనే రేషన్‌ వేయాలి. ప్రస్తుతం రేషన్‌ దుకాణాలు ఎప్పుడు తెరుస్తారో..ఎప్పుడు మూస్తారో అర్థం కావడంలేదు. దీంతో ఉదయం నుంచే రేషన్‌ దుకాణం వద్ద వేచి ఉండి బియ్యం తెచ్చుకున్నా. మా ఇంటి నుంచి రేషన్‌ షాపు కి.మీ దూరంలో ఉండడంతో చాలా ఇబ్బందిగా ఉంది.
– రాజేశ్వరి, గుంతకల్లు

అనంతపురం అర్బన్‌: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి పేదలను కష్టాలు నీడలా వెంటాడుతున్నాయి. తాజాగా రేషన్‌ కష్టాలు మొదలయ్యాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రేషన్‌ కోసం కార్డుదారులు ఎప్పుడూ ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. ఇంటి వద్దకు ఎండీయూ వాహనం వచ్చినప్పుడు బియ్యం, నిత్యావసర సరుకులు తెచ్చుకునేవారు. అయితే, కూటమి ప్రభుత్వం ఎండీయూ వాహన వ్యవస్థకు మంగళం పాడి చౌక దుకాణాల ద్వారానే సరుకుల పంపిణీకి తెరలేపడంతో పేద ప్రజలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం మొదటి రోజే చుక్కలు కనిపించాయి. ‘ఉదయమే ఇంటి పనులను వదిలేసుకుని చౌక దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చింది.. మాకేం కర్మ పట్టిందిరా స్వామి’ అంటూ పలువురు వాపోయారు.

8 గంటలకూ తెరచుకోని స్టోర్లు..
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్‌ పంపిణీ చేయాలని డీలర్లకు అధికారులు ఆదేశాలిచ్చారు. అయితే జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల ఉదయం 8 గంటలకు చౌక దుకాణాలు తెరుచుకోలేదు. అప్పటికే రేషన్‌ తీసుకునేందుకు వచ్చిన కార్డుదారులు దుకాణాల వద్ద పడిగాపులు కాశారు. డీలర్లు నింపాదిగా 9 గంటల తరువాత పంపిణీ ప్రారంభించారు.

ఇబ్బంది పడ్డ వృద్ధులు, మహిళలు..
సరుకులు తీసుకునేందుకు చౌక దుకాణాల వద్దకు వచ్చిన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు లైన్‌లలో నిలబడలేక తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. రాప్తాడు మండలం చిన్మయానగర్‌లో చౌక దుకాణం వద్ద చాలా ఆలస్యంగా పంపిణీ ప్రారంభించారు. ఉదయమే వచ్చిన కార్డుదారులు లైన్‌లో నిలబడలేక సంచులను వంతులుగా పెట్టి కూర్చున్నారు.

రెండు రోజులకు మించి ఇవ్వరు..!
చౌక దుకాణాల్లో ఒకటో తేదీ నుంచి 15 తేదీ వరకు రేషన్‌ పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని కార్డుదారులు అంటున్నారు. బియ్యం, సరుకులు రెండు రోజులకు మించి ఇవ్వరని చెబుతున్నారు. ఆ తరువాత వస్తే అయిపోయాయని అంటారని, అందుకే పనులు వదిలేసుకుని మరీ బియ్యం తీసుకునేందుకు మొదటిరోజే వచ్చామని పేర్కొంటున్నారు. డీలర్లు కచ్చితంగా 15వ తేదీ వరకు రేషన్‌ పంపిణీ చేసేలా అధికారులు చూడాలని, అలా ఇవ్వని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్డుదారులు కోరుతున్నారు.

 

గంటల తరబడి వేచి ఉన్నా.. 1
1/3

గంటల తరబడి వేచి ఉన్నా..

గంటల తరబడి వేచి ఉన్నా.. 2
2/3

గంటల తరబడి వేచి ఉన్నా..

గంటల తరబడి వేచి ఉన్నా.. 3
3/3

గంటల తరబడి వేచి ఉన్నా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement