
నేడు గుత్తిలో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం గుత్తి పట్టణంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు.గుత్తిలో పత్తికొండ రోడ్డులోని వసుధ ఫంక్షన్ హాలులో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని పేర్కొన్నారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలని సూచించారు. గుత్తి పట్టణ, మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
నాటు తుపాకీ స్వాధీనం
రాయదుర్గంటౌన్: ఓ వ్యక్తి అక్రమంగా తీసుకెళ్తున్న నాటు తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాయదుర్గం రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ వెంకటరమణ విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. డీ హీరేహాళ్ మండలంలోని పాత హడగలి గ్రామం వద్ద సీఐ వెంకటరమణ పర్యవేక్షణలో ఆదివారం ఎస్ఐ గురుప్రసాద్ వాహన తనిఖీ చేపట్టారన్నారు. ఈ క్రమంలోనే పాత హడగలి వైపు మోటార్ సైకిల్పై వెళ్తున్న కర్ణాటక రాష్ట్రం మొలకాల్మూరు తాలూకా కోనాపురం గ్రామా నికి చెందిన బోయ గంగన్న పోలీసులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడన్నారు. అనుమానంతో గంగన్నను పట్టుకుని వాహనాన్ని తనిఖీ చేయగా నాటు తుపాకీ, నల్ల మందు లభ్యమయ్యాయన్నారు. డీ హీరేహాళ్ మండలం కూడ్లూరు గ్రామంలోని ఓ దానిమ్మ తోటలో గంగన్న మామ నాగరాజు పనిచేస్తున్నాడన్నారు. తోటలో తిరుగుతున్న అడవి పందుల నుంచి కాపాడాలని చెప్పడంతో తన గ్రామానికే చెందిన బసవ అనే వ్యక్తితో నాటు తుపాకీ, నల్లమందును తీసుకుని గంగన్న కూడ్లూరుకు వెళ్తున్నట్లు వెల్లడైందన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఏమ్మా.. రేషన్ బియ్యం అన్నం బాగా ఉంటోందా?
● లబ్ధిదారుని ఆరా తీసిన కలెక్టర్
కూడేరు: ‘ఏమ్మా బియ్యం నాణ్యతగా ఉన్నాయా.. అన్నం బాగా అవుతోందా’ అంటూ కలెక్టర్ వినోద్కుమార్ రేషన్ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం కలెక్టర్ మండల పరిధిలోని కమ్మూరులోని రేషన్ షాపులో సరుకుల పంపిణీని తనిఖీ చేశారు. సక్రమంగా సరుకులు పంపిణీ చేయాలని డీలర్ను ఆదేశించారు. అనంతరం పలువురు కార్డుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి బియ్యంపై ఆరా తీశారు. చిట్టెమ్మ అనే మహిళ ఇంట్లో రేషన్ బియ్యంతో వండిన అన్నం తిన్నారు. అక్కడే ఉన్న మల్లేష్ కుమార్తె దీక్షను ఏం చదువుతున్నావమ్మా అంటూ పలకరించారు. పదిలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు దీక్ష తెలపగా.. సప్లిమెంటరీలో ఉత్తీర్ణత సాధించాక ఉన్నత చదువులు చదవాలని, ‘అనంత ఆణిముత్యాలు’ పథకం ద్వారా చదివిస్తామని భరోసా ఇచ్చారు. బాలికలు మధ్యలోనే చదువులు మానేయరాదని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కేశవ నాయుడు, తహసీల్దార్ మహబూబ్ బాషా, సీఎస్డీటీ లక్ష్మీదేవి తదితరులు వీఆర్ఓ రామకృష్ణ పాల్గొన్నారు.

నేడు గుత్తిలో ‘పరిష్కార వేదిక’

నేడు గుత్తిలో ‘పరిష్కార వేదిక’