
‘మా ప్రభుత్వం.. మాదే రాజ్యం.. ప్రశ్నించకూడదు.. ఎదురు చె
అనంతపురం సిటీ: ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ) రాజోలి రామచంద్రారెడ్డి విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధత కలిగిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఎక్కడ పని చేసినా.. ముక్కుసూటిగా పని చేయడంతో పాటు సౌమ్యుడిగా, వివాదరహితుడిగా గుర్తింపు పొందారు. నంద్యాల జిల్లా డ్వామా పీడీగా పని చేస్తున్న ఆయన్ను కూటమి ప్రభుత్వం కొన్ని నెలల క్రితం అనంతపురం జెడ్పీ సీఈఓగా బదిలీ చేసింది. డిసెంబర్ 28న ఆయన సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రభుత్వ ప్రాధాన్యాల మేరకు పని చేశారు. అనతి కాలంలోనే సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు తెచ్చుకోగలిగారు. అలాంటి అధికారిని అధికార టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారు. ఎలాగైనా జిల్లా దాటించాలని కంకణం కట్టుకున్నారు. జెడ్పీ చైర్పర్సన్ చాంబర్లో సీఎం ఫొటో సరైన స్థానంలో లేదంటూ రచ్చచేసి... దానికి సీఈఓను బాధ్యున్ని చేసి... ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బదిలీ చేయించారు.
రామచంద్రారెడ్డిపై కక్ష ఎందుకంటే..
వివిధ కారణాలతో ఖాళీ ఏర్పడ్డ స్థానిక సంస్థల పదవులకు ఇటీవల ఉప ఎన్నికలు నిర్వహించారు. ఆ సందర్భంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండల ఉపాధ్యక్ష (వైస్ ఎంపీపీ) స్థానానికీ ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికను ఎలాగైనా వాయిదా వేయించాలని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అక్కడి ఎంపీడీఓపై ఒత్తిడి తెచ్చారు. ‘ఇది ఎన్నికల కమిషన్ నిర్ణయం. మా చేతుల్లో ఏమీ ఉండదు సర్’ అంటూ అక్కడి అధికారి సమాధానమిచ్చారని తెలిసింది. దీంతో జెడ్పీ సీఈఓ ద్వారా ఎన్నిక వాయిదా వేయించాలనుకున్నా... అందుకు సీఈఓ అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు జిల్లాలో 15 మంది డిప్యూటీ ఎంపీడీఓ(ఈఓపీఆర్డీలు)లు, ఏఓలకు ఎంపీడీఓలుగా పదోన్నతులు రాగా, కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి పదోన్నతిపై మరో ఐదుగురు ఎంపీడీఓలు జిల్లాకు వచ్చారు. వారికి పోస్టింగ్ వేసే క్రమంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం ఎంపీడీఓగా విజయసింహారెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు. ఆయనకు పోస్టింగ్ ఇచ్చే ముందు ఎమ్మెల్యే తనయుడితో పాటు పీఏకూ సమాచారం ఇచ్చినట్లు సమాచారం. అయితే కూతురి పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్న ఎమ్మెల్యే తనకు తెలియకుండా ఎంపీడీఓకు పోస్టింగ్ ఇచ్చారని ఆగ్రహించి విజయ సింహారెడ్డిని వెనక్కి పంపేశారని సమాచారం. ఈ రెండు అంశాలను మనసులో పెట్టుకున్న ఎమ్మెల్యే సురేంద్రబాబు.. మడకశిర, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, దగ్గుపాటి ప్రసాద్ను కలుపుకొని.. సీఈఓ రామచంద్రారెడ్డిపై కక్ష గట్టినట్లు స్పష్టమవుతోంది.
మహిళా చైర్పర్సన్ చాంబర్లోకి ప్రవేశించి..
బోయ సామాజిక వర్గానికి చెందిన గిరిజమ్మ వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచి జెడ్పీ చైర్పర్సన్ అయ్యారు. ఆమె పదవీకాలం ఇంకా 15 నెలలు ఉంది. బీసీ కులం నుంచి వచ్చిన గిరిజమ్మ తమ అభిమాన నేత, మాజీ సీఎం జగన్ ఫొటోను తన చాంబర్లో ఉంచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో కూడా తన చాంబర్లో ఏర్పాటు చేయించారు. అయితే ఈ నెల 21న జెడ్పీ సర్వసభ్య సమావేశం జరుగుతుండగానే...ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి తదితరులు జెడ్పీ చైర్పర్సన్ చాంబర్లోకి చొరబడ్డారు. జిల్లా ప్రథమ పౌరురాలు, కేబినెట్ ర్యాంకు కలిగిన ప్రజాప్రతినిధి చాంబర్లోకి దూసుకెళ్లి చంద్రబాబు ఫొటో ఎక్కడంటూ రచ్చ చేశారు. ఈ సమయంలోనే జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డిని నోటికొచ్చినట్లు మాట్లాడారు. గ్రూప్–1 అధికారి అన్న గౌరవం కూడా లేకుండా అవమానించారు. ఆ తరువాత మాజీ సీఎం జగన్ ఫొటోను బలవంతంగా తీయించి, గాంధీజీ ఫొటో స్థానంలో సీఎం చంద్రబాబు ఫొటో పెట్టించారు. అంతటితో ఈ వివాదం సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు.
ముగ్గురు ఎమ్మెల్యేల దెబ్బకు జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి బదిలీ
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో సహకరించలేదని అక్కసు
ఓ ఎంపీడీఓకు పోస్టింగ్ విషయంలోనూ ఎమ్మెల్యే అమిలినేని అసంతృప్తి
జెడ్పీ సమావేశానికి వచ్చి చైర్పర్సన్ చాంబర్లో చంద్రబాబు ఫొటో లేదంటూ రగడ
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి... పోస్టింగ్ కూడా ఇవ్వకుండా కసి తీర్చుకున్న వైనం
నిజాయితీ అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారంటున్న ఉద్యోగులు

‘మా ప్రభుత్వం.. మాదే రాజ్యం.. ప్రశ్నించకూడదు.. ఎదురు చె